పొలంలో బంగారపు గని ఉందని.. | Sakshi
Sakshi News home page

పొలంలో బంగారపు గని ఉందని..

Published Sun, Jul 17 2016 11:43 AM

పొలంలో బంగారపు గని ఉందని..

బిజ్నోర్: జిల్లాలోని చాంద్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ రైతు తన పొలంలో దున్నుతుండగా హరప్పా నాగరికతకు చెందిన 4,500 సంవత్సరాలకు పూర్వం తయారుచేసిన రాగి వస్తువులు బయటపడ్డాయి. దీంతో ఆశ్చర్యపోయిన రైతు పొలంలో బంగారపు గని ఉండే అవకాశం ఉందని తవ్వకాలు ప్రారంభించాడు. కొద్ది సమయంలో ఈ వార్త హరినగర్ గ్రామం మొత్తం పాకడంతో ఆ రైతు చుట్టుపక్కల పొలాలు కలిగిన రైతులు కూడా బంగారం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ తవ్వకాల్లో మరికొన్ని రాగి వస్తువులు బయటపడ్డాయి.

బంగారం కోసం హరినగర్ గ్రామం పొలాల్లో తవ్వకాలు జరుపుతున్నారనే వార్తను తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ బీ చంద్రకళ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు సమాచారం అందించారు. దీంతో హూటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న ఏఎస్ఐ బృందం హరప్పా నాగరికతకు చెందిన వస్తువులు బయటపడ్డ ప్రదేశాన్ని పరిశీలించింది. ఇతరులను ఆ ప్రదేశంలోకి ప్రవేశించకుండా పోలీసుల సాయం తీసుకుంది.

వస్తువుల గురించి మాట్లాడిన ఏఎస్ఐ సూపరింటెండెంట్ భువన్ విక్రమ్ తవ్వకాల్లో దొరికిన రాగి వస్తువులన్నీ హరప్పా నాగరికతకు చెందినవిగా భావిస్తున్నామని తెలిపారు. పరిశోధనలు పూర్తయిన తర్వాత వీటి కచ్చితమైన వయస్సును నిర్దారిస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో ఇంకా మరిన్ని విలువైన వస్తువులు లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement