అటవీ హక్కుల చట్టం 2016ను అడవుల్లో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలు, ఇతర పురాతన అటవీ నివాసుల హక్కుల కోసం రూపొందించిందని గిరిజన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి జశ్వంత్సిన్హ్ భాభోర్ తెలిపారు. తరతరాలుగా అడవుల్లో నివసించే వారి కోసం, వారి హక్కులను రికార్డు చేయడం కోసం దీన్ని తీసుకొచ్చామన్నారు. ఈ చట్టం ద్వారా వారికి అన్నీ అధికారాలు ఇస్తున్నామని, అడవులను కాపాడటానికి, నిర్వహించడానికి వారి కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్లను స్వతంత్ర అథారిటీలుగా పరిగణిస్తున్నామని మంత్రి చెప్పారు. అడవుల సంరక్షణ చర్యలతో పాటు, చారిత్రాక అన్యాయాన్ని పరిష్కరించేందుకు ఆ యాక్ట్ దోహదం చేస్తుందన్నారు. అడవిలో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు, ఇతర పురాతన అటవీ నివాసులకు ఈ యాక్ట్ అటవీ హక్కులు కల్పిస్తుందన్నారు.
అందుబాటులో ఉన్న రికార్డుల బట్టి ఆంధ్రప్రదేశ్లోని పోలవరం, మామిడిగోండి ప్రాంతాల్లో ఈ చట్టం అమల్లో లేదని తెలిసిందన్నారు. విజ్ఞాపనల మేరకు ఆ యాక్ట్ను అమల్లోకి తెస్తున్నామన్నారు. చట్టం అమలు బాధ్యత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలపైనే ఉందన్నారు. ఈ విజ్ఞాపనలను ఆయా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలకు తీసుకెళ్లామని, వారే దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా రాజ్యసభలో అటవీ హక్కుల చట్టం 2016 కింద అటవీ నివాసితుల హక్కులపై వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా జశ్వంత్ సిన్హ్ భాభోర్ లిఖిత పూర్వకంగా ఈ వివరాలు అందించారు.