స్వర్గానికి వెళ్లాలని ఉందా? ఇదిగో చిరునామా.. | Sakshi
Sakshi News home page

స్వర్గానికి వెళ్లాలని ఉందా? ఇదిగో చిరునామా..

Published Fri, Aug 18 2017 10:21 AM

Get 'Moksha' or enter 'Swarga' at this airport-themed crematorium



బర్దోలీ‌:
ఎయిర్‌పోర్టులో అనౌన్స్‌మెంట్స్‌ వినబడుతుంటాయి.. ‘‘వారు స్వర్గానికి వెళ్లే సమయం ఆసన్నమైంది.. ఒకటో నంబర్‌ టెర్మినల్‌ గుండా లోపలికి తీసుకురండి..’’ అని! ఆ సూచనల మేరకు స్వర్గానికి వెళ్లాల్సిన వ్యక్తిని.. టెర్మినల్‌ వద్ద దింపేసి, బంధుగణమంతా బయటికి వెళ్లిపోతుంది. నిమిషాల వ్యవధిలోనే ఎయిర్‌పోర్ట్‌లోని లౌడ్‌స్పీకర్ల నుంచి విమానం టేకాఫ్‌ తీసుకున్న భారీ శబ్ధం వినపడుతుంది. ‘వారికి మోక్షం సిద్ధించింది.. స్వర్గానికి వెళ్లారు..’ అన్న చివరి ప్రకటన విని అందరూ ఇంటిబాట పడతారు.

స్వర్గలోక ప్రయాణం ఇక్కడి నుంచే: గుజరాత్‌లోని సూరత్‌ మెట్రోపాలిటన్‌ రీజయిన్‌లో బర్దోలీ మున్సిపాలిటీ ఉంది. ఆ పట్టణంగుండా మింధోలా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదీ తీరంలో ఉన్నదే.. ‘అంతిమ్‌ ఉడాన్‌ మోక్ష ఎయిర్‌పోర్ట్‌’! అక్కడ ‘స్వర్గ్‌ ఎయిర్‌లైన్స్‌’, ‘మోక్ష ఎయిర్‌లైన్స్‌’ అనే రెండు విమాన ప్రతిరూపాలు ఉంటాయి. టెర్మినళ్ల గుండా లోనికి వచ్చే పార్థివదేహాలకు ఎలక్ట్రిక్‌ క్రిమిటోరియం ద్వారా తంతు పూర్తిచేస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు విమానం టేకాఫ్‌ అవుతున్నప్పటి ధ్వనులను వినిపిస్తారు. బర్దోలీలోని మోక్ష ఎయిర్‌పోర్ట్‌ గుండా ఇప్పటికే చాలా మంది స్వర్గలోక ప్రయాణం చేశారు. రోజురోజుకూ రద్దీ ఎక్కువ అవుతుండటంతో దీనిని విస్తరించాలని భావిస్తున్నారు ‘మోక్ష ఎయిర్‌పోర్ట్‌’ నిర్వాహకుడు సోమాభాయ్‌ పటేల్‌.


బామ్మ మాట బంగారు బాట: ‘మరణం.. మనిషి ప్రయాణంలో ఒక మలుపు మాత్రమే. చనిపోయినవాళ్లు దర్జాగా విమానంలో స్వర్గలోకానికి వెళతారు. కాబట్టి ఎవరైనా పోతే అస్సలు ఏడవొద్దు..’ అని సోమాభాయ్‌ పటేల్‌కు వాళ్ల బామ్మ చెప్పింట. ఆమె చెప్పిన విషయాన్ని మనసావాచా నమ్మిన ఆయన.. చనిపోయినవారిని స్వర్గానికి సాగనంపే బాధ్యతను తలకెత్తుకున్నారు. మింధోలా నదీ తీరంలో పాడుబడిన శ్మశానానికి అన్ని హంగులూ కూర్చీ, కొత్త తరహా అంతిమయాత్రలకు ఆజ్యం పోశారు.

ప్రయాణం పూర్తిగా ఉచితం: శ్మశానం అనే పదం చాలా కరుకుగా ధ్వనిస్తుందని, అందుకే తాము నిర్మించిన ప్రదేశానికి ‘మోక్ష ఎయిర్‌పోర్ట్‌’అని పేరుపెట్టానని సోమాభాయ్‌ చెబుతారు. మొదట్లో ఒక్కో ప్రయాణానికి రూ.1000 చార్జ్‌ చేసేవాళ్లమని, క్రమంగా విరాళాలు విరివిగా వస్తుండటంతో చార్జీలను రద్దుచేశామని, ప్రస్తుతం ఉచితంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ‘మోక్ష ఎయిర్‌పోర్ట్‌లో మూడు ఎలక్ట్రిక్‌, రెండు సంప్రదాయ వాటికలు ఉన్నాయి.

Advertisement
Advertisement