-తమిళనాడు గవర్నర్ రోశయ్య
సాక్షి, హైదరాబాద్: గిడుగు గొప్ప జాతీయ భావాలు ఉన్న మంచి మనిషి అని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. శనివారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ సంపాదకులు ఏబీకే ప్రసాద్, ప్రముఖ పాత్రికేయులు డాక్టర్ జీఎస్ వరదాచారిలకు గిడుగు రామ్మూర్తి స్మారక పురస్కార ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రోశయ్య మాట్లాడుతూ తెలుగు క్రమంగా కనుమరుగయ్యే సమయంలో తెలుగును అధ్యయనం చేయాలని, తెలుగు అందరూ నేర్చుకోవాలని కోరుతూ అగ్రభాగాన నిలబడ్డ సాహితీమూర్తి గిడుగు రామ్మూర్తి అని కొనియాడారు. ఆయన పేరుతో అవార్డును ఎ.బి.కె. ప్రసాద్, జీఎస్ వరదాచారిలకు అందజేయటం అభినందనీయమన్నారు.
సభకు అధ్యక్షత వహించిన కె.వి. రమణాచారి మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధి కోసం పరితపించిన గిడుగు ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎ.బి.కె.ప్రసాద్ మాట్లాడుతూ గిడుగు స్ఫూర్తి ఇంకా పూర్తిగా ఆచరణలోకి రాలేదన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు ద్వానా శాస్త్రి, పాత్రికేయులు టి.ఉడయవర్లు, ఆధ్యాత్మిక వేత్త ఎ.ఎస్ మూర్తి, 'కిన్నెర' కార్యదర్శి మద్దాళి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.