చదవమన్నారని.. తల్లిదండ్రులను చంపేసింది | Sakshi
Sakshi News home page

చదవమన్నారని.. తల్లిదండ్రులను చంపేసింది

Published Sat, Oct 18 2014 12:04 PM

చదవమన్నారని.. తల్లిదండ్రులను చంపేసింది - Sakshi

తనను దత్తత తీసుకుని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను తన బోయ్ఫ్రెండుతో కలిసి చంపేసిందో యువతి. పైగా మృతదేహాలను 72 రోజుల పాటు అదే ఇంట్లో ఉంచింది. ఈ సంఘటన గుజరాత్లోని బరోడా నగరంలో తిరుపతి సొసైటీ ప్రాంతంలో జరిగింది. శ్రీహరి వినోద్ (63), ఆయన భార్య స్నేహ (60) ఇద్దరినీ చంపిన నేరంలో 16 ఏళ్ల యువతితో పాటు ఆమె 21 ఏళ్ల బోయ్ఫ్రెండు సపన్ పురానీ ఇద్దరినీ అరెస్టు చేసినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ డీజే పాటిల్ చెప్పారు. ఆగస్టు మూడోతేదీ రాత్రి ఈ హత్యలు జరిగాయి. తాళం వేసి ఉన్న ఇంట్లోంచి ఏదో దుర్వాసన వస్తోందని చుట్టుపక్కల వాళ్లు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బలవంతంగా తలుపు తెరిచి చూస్తే అందులో రెండు శవాలున్నాయి.

మహారాష్ట్రకు చెందిన ఆ దంపతులు తమకు పిల్లలు పుట్టకపోవడంతో ఏడాది వయసున్న ఆ అమ్మాయిని 15 ఏళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయి.. హత్య అనంతరం తర బోయ్ఫ్రెండుతో కలిసి ఉంటోందని పోలీసులు చెప్పారు. మధ్యమధ్యలో ఆ బోయ్ఫ్రెండు మాత్రం ఇంటికి వచ్చి, మృతదేహాల మీద సెంటు చల్లుతూ ఉండేవాడని తెలిపారు. పోలీసులకు అనుమానం వచ్చి దత్తత కుమార్తెను ప్రశ్నించగా మొత్తం విషయం బయటపడింది. తన తల్లిదండ్రులు తనను కొట్టేవారని, తనకు చదువుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా చదివించేవాళ్లని ఆమె చెప్పింది. అందుకే తన బోయ్ఫ్రెండుతో కలిసి చంపేసినట్లు పోలీసులకు తెలిపింది.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement
Advertisement