న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని రుణాల రికవరీ ట్రిబ్యునల్ వద్ద కేసుల జాబితా పెరగడానికి ప్రధాన కారణం బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ విపరీతంగా ఫిర్యాదులు దాఖలు చేయడమేనని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. స్థూల నిరర్థక ఆస్తులు భారీగా పెరగడంతోనే బ్యాంకులు ఈ ఫిర్యాదులను దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డీఆర్టీలో పేరుకుపోతున్న పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడానికి సెక్యురిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్సియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యురిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లో ప్రభుత్వం సవరణలు చేపట్టిందన్నారు.
రుణాల రికవరీకి సంబంధించి 2016 నవంబర్ 5న సెమినార్ నిర్వమించామని, ఆ సెమినార్లో అప్పీలెట్ ట్రిబ్యునల్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నట్టు ఆయన చెప్పారు. రికవరీ చట్టాల్లో సవరణలు, ఆర్థికంగా దివాలా కోడ్ 2016 వంటివాటిపై చర్చించామని పేర్కొన్నారు. విశాఖపట్నం డీఆర్టీలో ఏడాది ఏడాదికి కేసులు పెరగడంపై వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి మంగళవారం జరిగిన రాజ్యసభలో పలు ప్రశ్నలు సంధించారు. ఒకవేళ అదే నిజమైతే కేసులను సత్వరంగా పరిష్కరించడానికి డీఆర్టీ, మంత్రిత్వశాఖ తీసుకునే చర్యలపై ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.