అమ్మను చంపాడని.. మామను కాల్చేశాడు | Sakshi
Sakshi News home page

అమ్మను చంపాడని.. మామను కాల్చేశాడు

Published Mon, Nov 2 2015 5:59 PM

అమ్మను చంపాడని.. మామను కాల్చేశాడు - Sakshi

దాదాపు పదేళ్ల క్రితం తన తల్లిని చంపాడన్న కోపంతో.. మామను కాల్చిచంపిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీ శివార్లలోని గుర్‌గావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తన మామ సందీప్ కటారియా (35)ను కాల్చి చంపిన నేరంలో లలిత్ అలియాస్ జానీని పోలీసులు అరెస్టు చేశారు. కటారియాకు శ్రీ రాధాకృష్ణ కౌ కేర్ సెంటర్ ఉంది. దాదాపు పది సంవత్సరాల క్రితం ఆస్తి తగాదాల నేపథ్యంలో లలిత్ తల్లిని కటారియా, మరికొందరు కలిసి కాల్చి చంపారు. అప్పటికి లలిత్ వయసు ఎనిమిదేళ్లు. తన తల్లిని చంపాడన్న కోపంతో ఉన్న లలిత్.. ఇప్పటికే 2013-14 మధ్య రెండుసార్లు కటారియాను చంపేందుకు ప్రయత్నించాడు. అయితే, అప్పట్లో ఈ దాడుల వెనక ఉన్నది అతడన్న విషయం కటారియాకు తెలియదు.

చివరకు గో సంరక్షణ కేంద్రంలో ఉన్న కటారియాను లలిత్ తన నలుగురు స్నేహితులతో కలిసి కాల్చి చంపాడు. ఇద్దరు గేటు వద్ద వేచి ఉండగా, మరో ఇద్దరితో కలిసి అతడు లోపలకు వెళ్లి కాల్పులు జరిపాడు. నిందితులందరూ 20 ఏళ్ల వయసులోని వారేనని, అందరూ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. తమ కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తిలో గోసంరక్షణ కేంద్రం పెట్టుకుని, అందులోనే తమను పనికి పెట్టి తక్కువ జీతాలు ఇస్తున్నాడని కూడా లలిత్‌కు కోపం ఉండేదని స్థానికులు అంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement