పాతనోట్లు ఉన్నాయా.. రూ. 10వేల ఫైన్! | Sakshi
Sakshi News home page

పాతనోట్లు ఉన్నాయా.. రూ. 10వేల ఫైన్!

Published Thu, Mar 2 2017 12:54 AM

పాతనోట్లు ఉన్నాయా.. రూ. 10వేల ఫైన్! - Sakshi

పెద్దనోట్ల రద్దు తర్వాత చాలామంది తమ వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చేసుకున్నారు. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకుని, కొత్త నోట్లు తీసుకున్నారు. అయితే కొంతమంది వద్ద మాత్రం ఇంకా ఆ నోట్లు ఉండిపోయాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పటికి చెలామణిలో ఉన్న కరెన్సీకి.. నోట్ల రద్దు తర్వాత వెనక్కి తిరిగి వచ్చిన కరెన్సీకి మధ్య తేడా కనిపించింది. దాంతో కొంతమంది ఇంకా పాతనోట్లను ఉంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు అలా ఎవరివద్ద అయినా పది కంటే ఎక్కువ సంఖ్యలో రద్దయిన పాతనోట్లు ఉంటే, వాళ్లకు కనీసం రూ. 10 వేల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం కొత్త చట్టం ఒకదాన్ని తెచ్చింది. 
 
పాత నోట్లను ఉపయోగించి సమాంతర ఆర్థికవ్యవస్థను నడిపించే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తెచ్చినట్లు చెబుతున్నారు. దీన్ని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఫిబ్రవరి 27న దీనిపై సంతకం చేసేశారు. దాంతో ఇది చట్టరూపం దాల్చింది. పెద్దనోట్ల రద్దు సమయంలో విదేశాల్లో ఉండి, తప్పుడు డిక్లరేషన్లు ఇస్తే వారికి రూ. 50వేల కనీస జరిమానా విధించే అవకాశం కూడా ఈ చట్టంలో ఉంది. వ్యక్తుల వద్ద పది నోట్ల కంటే ఎక్కువ, పరిశోధన అవసరాల కోసం అయితే 25 నోట్లకన్నా ఎక్కువ చేతిలో ఉంచుకోవడం నేరం అవుతుంది. అందుకు రూ. 10వేల జరిమానా లేదా వాళ్ల దగ్గరున్న నగదు విలువకు ఐదు రెట్ల మొత్తం.. ఏది ఎక్కువైతే అది విధిస్తారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement