ఢిల్లీలో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఏఐసీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రధాని పదవికి అన్ని విధాల రాహుల్ గాంధీ అర్హుడు అంటూ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఏఐసీసీ సమావేశాలు జరుగుతున్న ప్రాంగణం అంతా సభ్యుల నినాదాలతో మారుమ్రోగింది. దాంతో నేతలు మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు కొంత సేపు విరమించుకున్నారు. కాగా రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమారుడు పీవీ రంగారావులకు ఏఐసీసీ ఘనంగా నివాళులర్పించింది.