లోక్సభకు పోటీ చేసేందుకు సిద్ధం: కేజ్రీవాల్ | Sakshi
Sakshi News home page

లోక్సభకు పోటీ చేసేందుకు సిద్ధం: కేజ్రీవాల్

Published Sat, Jan 18 2014 8:55 PM

లోక్సభకు పోటీ చేసేందుకు సిద్ధం: కేజ్రీవాల్ - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మనసు మార్చుకున్నారు. పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించారు. కాగా అత్యున్నత పదవికి తాను రేసులో ఉండబోనని పరోక్షంగా ప్రధాని పదవి గురించి ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోటీ జరుగుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

తాను కానీ మరే ఎమ్మెల్యే కానీ లోక్సభకు పోటీచేయమని గతంలో కేజ్రీవాల్ ప్రకటించారు. లోక్సభకు పోటీ చేయాలని తాను వ్యక్తిగతంగా భావించడం లేదని, అయితే పార్టీ అవసరమని భావిస్తే సిద్ధమని చెప్పారు. తాను ఏ పదవినీ కోరుకోవడం లేదని, దేశమంతటా స్వరాజ్యాన్ని విస్తరించడమే తన లక్ష్యమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపదని, బీజేపీకి ఆప్కు ప్రధానంగా పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఫలితాలు దేశమంతటా పునరావృతమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల కంటే ఢిల్లీ అత్యుత్తమ పాలన అందిస్తామని కేజ్రీవాల్ చెప్పారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement