ప్రైవేట్ దిగ్గజానికి భారీ డిపాజిట్లు | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ దిగ్గజానికి భారీ డిపాజిట్లు

Published Sat, Nov 19 2016 9:31 AM

ప్రైవేట్ దిగ్గజానికి భారీ డిపాజిట్లు

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుగా పేరున్న ఐసీఐసీఐ బ్యాంకు, పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా డిపాజిట్లను ఆర్జించినట్టు ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచ్చర్ తెలిపారు. శుక్రవారం వరకు రూ.32వేల కోట్ల డిపాజిట్లు బ్యాంకులో నమోదయ్యాయని ఆమె వెల్లడించారు. నోట్ల మార్పిడికి బ్యాంకులు, ఏటీఎంల వద్ద నెలకొన్న భారీ రద్దీ, క్యూలైన్లపై స్పందించిన కొచ్చర్, ప్రజలు వారు  ఎదుర్కొంటున్న సమస్యలపై చాలా కోపంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. కొత్త రూ.500 నోట్లను ఏటీఎంల ద్వారా ఎక్కువగా అందుబాటులోకి తీసుకొస్తే, కస్టమర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించుకుని, పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని కొచ్చర్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
 
 ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చెల్లింపులన్నీ డిజిటల్ మార్గంలోకి పయనిస్తున్నాయని తెలిపారు. వర్తకుల నుంచి తమకు చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయని, సేల్ టెర్నినల్స్ను ఏర్పాటుచేయాలని వారు అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా వాడకుండా మూలన పడిఉన్న ఏటీఎం కార్డుల వాడకం కూడా పెరిగిందని చెప్పారు. బ్లాక్మనీపై ఉక్కుపాదం మోపుతూ, అవినీతిని నిర్మూలించడానికి నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు బ్యాంకులకు రూ.5 ట్రిలియన్ వరకు డిపాజిట్లు నమోదయ్యాయి. బ్యాంకింగ్ డిపాజిట్ల వెల్లువ అటు ఉంచితే, ఎక్కువగా నగదు లావాదేవీలపైనే ఆధారపడిన మన దేశంలో పెద్ద నోట్ల రద్దుతో, బ్యాంకు నోట్లు ఎక్స్చేంజ్కు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Advertisement
Advertisement