గాంధీ, నెహ్రూ, ఇందిర గ్రేట్..! | Sakshi
Sakshi News home page

గాంధీ, నెహ్రూ, ఇందిర గ్రేట్..!

Published Fri, Oct 30 2015 1:03 AM

India-Africa ties embodiment of South-South cooperation

సదస్సులో ఆఫ్రికా నేతల ప్రశంసలు
న్యూఢిల్లీ: ఇండియా- ఆఫ్రికా ఫోరం సదస్సులో పలువురు ఆఫ్రికా అగ్ర దేశాల అధినేతలు జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. భారత్- ఆఫ్రికాల మధ్య సత్సంబంధాలకు ఆ ముగ్గురు నేతలు చేసిన కృషిని, ఆఫ్రికా, ఇండియాల మధ్య చరిత్రాత్మక సంబంధాలను తమ ప్రసంగాల్లో వారు గుర్తు చేశారు. ‘దాదాపు శతాబ్ద కాలంగా ఆఫ్రికా, భారత్‌లను ఐక్యంగా ఉంచుతున్న బంధాలను, ఆ విషయంలో ఇద్దరు దార్శనిక ప్రధానులైన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు చూపిన చొరవను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం అవసరం’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పేర్కొన్నారు.

1955లో జరిగిన ప్రఖ్యాత బాండుంగ్ సదస్సులో, అనంతరం అలీనోద్యమంలో నెహ్రూ పోషించిన పాత్రను జుమా గొప్పగా ప్రశంసించారు. ఆఫ్రికా - ఇండియా డెవలప్‌మెంట్ కోఆపరేషన్ ఏర్పాటులో, ఆఫ్రికా దేశాల స్వాతంత్య్రోద్యమాల్లో ఇందిరాగాంధీ అందించిన సహకారం మరవలేనిదన్నారు. అహింసా విధానంలో వలసపాలనకు అంతం పలికే ఉద్యమానికి గాంధీ, నెహ్రూలు నేతృత్వం వహించారని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌ను గొప్ప పార్టీగా ముగాబే అభివర్ణించారు. ఆఫ్రికాలో వలస పాలనకు వ్యతిరేకంగా నెహ్రూ, తన తాత కలిసి పనిచేశారని మొరాకో రాజు మొహమ్మద్6 గుర్తు చేశారు.

Advertisement
Advertisement