న్యూఢిల్లీ : భారతీయ యువతకు ఎవరంటే ఎక్కువగా ఇష్టమో తెలుసా..? రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య లంటే తెగ ఇష్టమట. యూనివర్సమ్ నిర్వహించిన జాబ్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2016 అత్యంత ఆకర్షణీయమైన యజమాని(ఎంప్లాయర్) ర్యాంకింగ్ లను యూనివర్సమ్ విడుదలచేసింది. గూగుల్, యాపిల్ ల తర్వాత అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ గా ఆర్ బీఐ గవర్నర్ రాజన్ మూడోస్థానంలో నిలిచారు. అయితే అమెరికన్ టెక్ దిగ్గజాలు ఫేస్ బుక్, మైక్రోసాప్ట్ లను అధిగమించి, ఆర్బీఐ, ఎస్ బీఐలు ఆకర్షణీయమైన ఎంప్లాయర్లగా చోటు దక్కించుకున్నాయి.
భారత్ లో మొత్తం 157 యూనివర్సిటీలో 29,448 విద్యార్థులపై ఈ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ పై భారతీయ యువతకు పెరుగుతున్న ఆదరణను గుర్తించారు. దీంతో ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ లో నెలకొన్న అసమర్థత, పేలవమైన పని వాతావరణం ఎంతో కాలం ఉండదని తెలుస్తోంది. అమెరికన్ టెక్ దిగ్గజాలను అధిగమించి ఆర్ బీఐ లాంటి సంస్థలు యువతను ఎక్కువగా ఆకట్టుకునే కంపెనీగా నిలవడం, ఆ ఆర్గనైజేషన్ లపై ఉన్న ఆలోచన దృకోణాన్ని మార్చుతోందని సర్వే పేర్కొంది.
రాజన్, భట్టాచార్యలు సమర్థవంతమైన ఎంప్లాయర్లుగా.. ఈ సంస్థలను విజయవంతమైన బాటలో నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ బీఐలో ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదా ఐఐఎమ్ లనుంచి ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. అదేవిధంగా ఎస్ బీఐ సైతం తన సొంత ఎంట్రన్స్ ఎగ్జామ్ తో ఉద్యోగ నియామకాలు చేపట్టి, ట్రైనింగ్ ఇస్తుంటోంది.