ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి ఇంద్రాణి ముఖర్జియా పోలీస్ కస్టడీని స్థానిక కోర్టు సెప్టెంబర్ 5 వరకూ పొడిగించింది. షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఇంద్రాణి ముఖర్జీయాను విచారించడానికి మరికొంత సమయం కావాలని ముంబై పోలీసులు కోర్టుకు విన్నవించారు. వారి అభ్యర్థనను మన్నించిన కోర్టు.. ఆమె కస్టడీని పొడిగించింది.
కాగా, మరోవైపు ఇంద్రాణి ముఖర్జీ తరుపున వాదనలు కూడా వాడివేడిగా జరిగాయి. ఇప్పటికే ఇంద్రాణిని 80-90 గంటలు విచారించారని.. ఇంకా ఇంద్రాణిని పోలీస్ కస్టడీలో తీసుకోవాల్సిన అవసరం లేదని ఇంద్రాణి తరపు న్యాయవాది వాదించారు. ఇప్పటికే ఆమెపై హత్యకేసును నమోదు చేసిన పోలీసులకు కస్టడీ అవసరం లేదన్నారు. అయితే ఇంద్రాణి తరుపు న్యాయవాది వాదనతో ఏకీభవించని కోర్టు.. ఆమె పోలీస్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకూ పొడిగించింది.