సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టినందున ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉద్బోధించారు. ప్రజలతో క్షేత్రస్థాయిలో ‘కలవడం, మాట్లాడ డం, సమన్వయం చేసుకోవడం’ ద్వారా పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అమిత్షా ఈ మేరకు అధ్యక్షుడిగా పార్టీ ఎంపీలనుద్దేశించి తొలిసారి ప్రసంగించారు. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా కాంగ్రెసేతర పార్టీకి సంపూర్ణ మెజార్టీ అనేది చారిత్రక ఘట్టంగా నిలిచిపోయిందన్నారు. నియోజకవర్గాల్లో ప్రజలకు బాగా ఉపయోగపడే పనుల కోసం ఎంపీ నిధులు వినియోగించాలని, అందుకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ ఎంపీలను ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు పంపేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇటీవల ఏర్పాటైన 18 పార్లమెంటరీ కమిటీలు ఏకగ్రీవం కావటం విశేషమన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా కె. బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు చెందిన బాలసుబ్రమణ్యం సుప్రీంకోర్టులో చాలాకాలంపాటు న్యాయవాదిగా పనిచేశారు.