Sakshi News home page

ఆరో పెళ్లి కోసం ఐదో భార్యను చంపాడు

Published Fri, Dec 16 2016 9:19 AM

ఆరో పెళ్లి కోసం ఐదో భార్యను చంపాడు

రాంచీ: జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భుమ్‌ జిల్లా అస్తి గ్రామానికి చెందిన రామచంద్ర పటార్‌ (51)  లేటు వయసులో ఆరో పెళ్లికి సిద్ధపడ్డాడు.  పటార్‌ ఐదుమంది భార‍్యలు ఏమయ్యారనే సందేహం రావచ్చు. మొదటి ఇద్దరు భార‍్యలు (దశోబాల, భారతి) ఆయనకు దూరంగా వేరుగా ఉంటున్నారు. మరో ఇద్దరు భార్యలు (ఫుల్మోని, ప్రమీల) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఐదో భార్య ఖైరి ఆయన ఇంట్లో మంగళవారం రాత్రి శవమై కనిపించింది. ఆరు నెలల క్రితమే ఒడిశాకు చెందిన 35 ఏళ్ల ఖైరిని పెళ్లి చేసుకున్నాడు. ఆరో పెళ్లి చేసుకోవడం కోసం పటారే ఆమెను దారుణంగా హత‍్య చేశాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఖైరిని కొట్టి, గొంతు నులిమి చంపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

పటార్‌ గతంలో కూడా ఇద్దరు భార్యలను చంపేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో ఆయన ముగ్గురు భార్యలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారని చెప్పారు. మూడవ, నాలుగో భార్య చనిపోయినపుడు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పటార్‌ చట్టం నుంచి తప్పించుకున్నాడు. కాగా ఐదో భార్య చనిపోయినపుడు ఆమె శరీరంపై గాయాలు ఉండటం, మృతురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు పటార్‌ను అరెస్ట్‌ చేశారు.  ఖైరి మద్యం ఎక్కువగా తాగిందని, కిందపడటంతో తలకు గాయమై చనిపోయిందని పటార్‌ చెప్పాడు. అయితే పటార్‌ ఆరో పెళ్లి చేసుకోవాలని  భావించాడని, ఈ విషయంపై భార్యతో తరచూ గొడవ పడేవాడని, ఆమెను హత్య చేసివుంటాడని గ్రామస్తులు చెప్పారు.

Advertisement
Advertisement