ఆ హీరో-హీరోయిన్ల పబ్లిసిటీ కక్కుర్తితో.. | Sakshi
Sakshi News home page

ఆ హీరో-హీరోయిన్ల పబ్లిసిటీ కక్కుర్తితో..

Published Wed, Sep 7 2016 9:55 AM

ఆ హీరో-హీరోయిన్ల పబ్లిసిటీ కక్కుర్తితో.. - Sakshi

  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో భద్రతాపరమైన ఆందోళన

  • బాలీవుడ్ తారలు కత్రినా ఖైఫ్, సిద్ధార్థ మల్హోత్రా సోమవారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందికి చుక్కలు చూపించారు. తమ తాజా సినిమా 'బార్ బార్ దేఖో'కు పబ్లిసిటీ కల్పించుకునేందుకు ఏకంగా ఎయిర్ పోర్ట్ లో ఈ ఇద్దరు తారలు పిచ్చివేషాలు వేశారు. దీంతో విమానాశ్రయంలో ఒకింత భద్రతాపరమైన ఆందోళన నెలకొంది.

    కత్రినా, సిద్ధార్థ ముంబైకి వెళ్లే ఎయిరిండియా విమానం (ఏఐ 317) టికెట్లు కొని ఎయిర్ పోర్టులోకి ప్రవేశించారు. ఆ టికెట్లను చూపించి టీ3 ప్రధాన టెర్మినల్ లోకి ప్రవేశించిన ఈ జంట.. ఏకంగా డ్యూటీ ఫ్రీ ఏరియాలోకి వెళ్లి ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొన్ని డ్యాన్సులు, డైలాగులు చెప్పారు. ఆ తర్వాత తాము టికెట్లు కొనుగోలు చేసిన విమానం ఎక్కకుండా ఇంటిముఖం పట్టారు.

    వారి తీరుపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ ఎఫ్) అధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన ప్రయాణం చేసే ఉద్దేశం లేకుంటే వారు విజిటర్స్ ఎంట్రీ పాస్ తీసుకొని వచ్చేది ఉండాల్సింది కానీ, ప్రయాణికుల మాదిరిగా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించి వారు విమాన సిబ్బందిని, భద్రతా ఏజెన్సీని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. వారు కేవలం సినిమా ప్రమోట్ చేసుకోవడానికే వచ్చినట్టు కనిపించిందని, అందుకే తెగించి మరీ డ్యూటీ ఫ్రీ ఏరియాలోకి వెళ్లారని ఆ అధికారి తప్పుబట్టారు. మరోవైపు విమానం బయలుదేరడానికిముందే టీ3 టెర్మినల్ నుంచి బయటకు వచ్చేందుకు కత్రినా, సిద్ధార్థ ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎయిర్ లైన్ ప్రోసిజర్ పూర్తయిన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుమతించారు.

Advertisement
Advertisement