- 30 మందిని చంపేశాం: ఉగ్రనాయకుడు హఫీజ్ సయీద్
- అది తప్పు, చనిపోయింది ముగ్గురే: ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం జరిపిన దాడులకు ప్రతీకారంగా, జమ్ముకశ్మీర్లోని అఖ్నూర్ ఆర్మీ క్యాంపుపై నలుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు దాడి చేశారని, మొత్తం 30 మంది సైనికులను చంపేసి, సురక్షితంగా తప్పించుకున్నారని టెర్రరిస్టు నాయకుడు హఫీజ్ సయీద్ చెప్పుకున్నాడు. అయితే భారత సైన్యం మాత్రం ఆ ప్రకటనను ఖండించింది. హఫీజ్ చెప్పినట్లు కాక, వేరొక ఘటనలో ముగ్గురు కూలీలు చనిపోయారని వివరణ ఇచ్చింది.
ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉల్ దవా ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ బుధవారం ముజఫరాబాద్లో ఒక సభ నిర్వహించాడు. ఆ ప్రసంగం తాలూకు ఆడియోను పలు వార్తా సంస్థలు ప్రసారం చెయ్యడంతో దుమారం చెలరేగింది. పీవోకేలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ బూటకమని, ఈ విషయంలో మోదీ సర్కారు ప్రపంచాన్ని మోసం చేసిందని హఫీజ్ ఆరోపించాడు. ‘అసలైన సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉంటుందో మన ముజాహిద్దీన్లు(ఉగ్రవాదులు) మొన్ననే(సోమవారం) ఇండియాకు రుచి చూపించారు. అఖ్నూర్ ఆర్మీపై మెరుపుదాడిచేసి, 30 మంది సైనికుల్ని చంపేసి, చిన్న గాయం కూడా లేకుండా సురక్షితంగా తిరిగొచ్చారు’అని ఆడియోలో హఫీజ్ అన్నాడు.
అసలేం జరిగిందంటే..
హఫీజ్ వ్యాఖ్యలను ఖండించిన భారత సైన్యాధికారులు ఆ రోజు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. ‘పాక్ సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలో జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్(డీఆర్ఈఎఫ్) క్యాంపుపై సోమవారం ఉగ్రవాదులు దాడిచేశారు. ఆ సమయంలో అక్కడ 10 మంది సిబ్బంది, మరో 10 మంది కూలీలు ఇంజనీరింగ్ పనులు చేస్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు డీఆర్ఈఎఫ్ కూలీలు చనిపోగా, మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. హఫీజ్ చెప్పుకున్నట్లు 30 మంది చనిపోవడంగానీ, ఆర్మీ క్యాంపుపై దాడిగానీ జరగలేదు’ అని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.