Sakshi News home page

భూ బిల్లు కీలకాంశాలపై నేడు జేపీసీ భేటీ

Published Mon, Aug 10 2015 4:05 AM

land bill On Today JPC metting

న్యూఢిల్లీ: వివాదాస్పద భూ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకుగానూ దీనిపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సోమవారం తుదిసారి భేటీ కానుంది.  ఇందులో కీలకాంశాలపై చర్చించనుంది. వినియోగించని భూమిని ఐదేళ్ల తర్వాత అసలు యజమానికి అప్పగించే నిబంధనతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుతం ఈ బిల్లును బీజేపీ ఎంపీ ఎస్‌ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని 30 మంది సభ్యుల సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రతిపాదిత బిల్లులో రైతుల సమ్మతి, సామాజిక ప్రభావ అంచనా తదితర ఆరు అంశాలను చేర్చేందుకు ఇప్పటికే  కమిటీ ఏకాభిప్రాయానికి రావడం తెలిసిందే. అయితే మరో మూడు అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కోసం ఈ భేటీలో ప్రయత్నించనుంది.  మంగళవారం కమిటీ తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉన్నందున కీలకాంశాలపై ఏకాభిప్రాయం సాధించి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ బిల్లులో మార్పులకు సోమవారం ఆమోదముద్ర వేయనుంది.

కాగా, లోక్‌పాల్ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి మరో రెండు నెలల గడువు లభించింది. ఈ బిల్లుకు సంబంధించి కమిటీకి గడువును పొడిగించడం ఇది రెండోసారి. మరోపక్క.. జీఎస్టీ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందాక బిల్లులో సవరణలు చేసేందుకు సిద్ధమని కేంద్ర హోం మంత్రి మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

Advertisement
Advertisement