హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో మొబైల్, టెక్నాలజీ ఉత్పత్తుల విక్రయ సంస్థ లేటెస్ట్వన్ డాట్ కాం తాజాగా టోకు వర్తకుల కోసం హోల్సేల్ పోర్టల్ ఆవిష్కరించింది. ఈ పోర్టల్ ఆవిష్కరణ సందర్భంగా తమ కార్యకలాపాల విస్తరణ కోసం ఈ ఏడాది రూ.45 కోట్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్టు సంస్థ చైర్మన్, వ్యవస్థాపకుడు పాలెం శ్రీకాంత్ రెడ్డి బుధవారం తెలిపారు. కంపెనీ నుంచి రూ.15 కోట్లు, మిగతా రూ.30 కోట్లను పీఈ ప్లేయర్ల నుంచి సేకరించనున్నట్టు వివరించారు.
కంపెనీకి రోజుకు ఐదు వేల రిజిస్ట్రర్ ఆర్డర్లు నమోదవుతున్నాయని, ఈ సంఖ్యను వచ్చే ఏడాదికల్లా రోజుకు 10వేల ఆర్డర్లు నమోదుచేసుకునేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఆర్డర్లతో పాటు, ఆదాయాలను పెంచుకోనున్నట్టు వివరించారు. అదేవిధంగా బెంగళూరుకు దగ్గర్లో ఉండేలా అనంతపురం జిల్లా హిందూపూరం వంటి ప్రాంతంల్లో మరో ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.