ప్రధాని మోదీకి లక్నో మహిళ లేఖ | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి లక్నో మహిళ లేఖ

Published Wed, Mar 29 2017 3:39 PM

ప్రధాని మోదీకి లక్నో మహిళ లేఖ

లక్నో: ఇస్లాంలో కొనసాగుతున్న ట్రిఫుల్ తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్‌ కు చెందిన బాధితురాలు ఒకరు ప్రధాని నరేంద్ర మోదీకి మొర పెట్టుకుంది. ఈ దుష్ట సంప్రదాయానికి చరమగీతం పాడాలని కోరుతూ ప్రధానికి లక్నో మహిళ షాగుఫ్తా షా లేఖ రాసింది. ట్రిఫుల్ తలాక్ ను రద్దు చేస్తారని తాను బీజేపీకి ఓటు వేశానని వెల్లడించింది.

అబార్షన్ చేయించుకునేందుకు నిరాకరించడంతో తనను భర్త వదిలేశాడని తెలిపింది. ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుడుతుందన్న భయంతో తన భర్త షంషాద్ సయాద్ అబార్షన్ చేయించాలనుకున్నాడని తెలిపింది. తాను ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితం హింసించి ఇంటి నుంచి గెంటేశాడని, ట్రిఫుల్ తలాక్ చెప్పి తనను వదిలించుకున్నాడని వివరించింది. షారంగ్ పూర్ ప్రాంతానికి చెందిన షాగుఫ్తాకు సహాయం అందించేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. అయితే ప్రధాని అయితేనే తనకు న్యాయం చేయగలరన్న ఉద్దేశంతో ఆయనకు ఆమె లేఖ రాసింది.

‘పేద, నిస్సహారాయులి మొర ఆలకించాలని ప్రధానమంత్రిని కోరుతున్నా. నాలాంటి వాళ్లకు న్యాయం జరగాలంటే ఈ దుష్ట సంప్రదాయానికి చరమగీతం పాడాలి. అప్పుడే మేమంతా గౌరవడం బతక గలుగుతామ’ని లేఖలో పేర్కొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, జిల్లా కలెక్టర్, జాతీయ మహిళా కమిషన్ కు కూడా లేఖ ప్రతులు ఆమె పంపించింది.

Advertisement
Advertisement