డిన్నర్‌కు పిలిచి నమ్మకద్రోహం చేశాడు! | Sakshi
Sakshi News home page

డిన్నర్‌కు పిలిచి నమ్మకద్రోహం చేశాడు!

Published Thu, Aug 4 2016 4:34 PM

డిన్నర్‌కు పిలిచి నమ్మకద్రోహం చేశాడు! - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా మహిళపై అత్యాచారం కేసులో ‘పీప్లి లైవ్‌’  సినిమా కో-డైరెక్టర్‌ మహమూద్‌ ఫారుఖీకి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన 35 ఏళ్ల మహిళను ఫారుఖీ రేప్‌ చేసినట్టు అభియోగాలు రుజువయ్యాయి. దీంతో ఢిల్లీ కోర్టు గురువారం ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది.

ఒక స్నేహితుడి తరహాలో విదేశీ మహిళను డిన్నర్‌కు పిలిచిన ఫారుఖీ.. ఆ తర్వాత నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని, ఆమెపై అత్యాచారం జరిపిన ఆయనకు జీవితఖైదు విధించాలని ప్రాసిక్యూషన్‌ లాయర్‌ కోర్టును కోరారు.  గత మంగళవారం ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ లాయర్ల వాదనలు విన్న అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి సంజీవ్‌ జైన్‌.. దోషికి శిక్ష విధింపును గురువారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

గత ఏడాది మార్చిలో ఆమెపై ఢిల్లీలో ఫారుఖీ అత్యాచారానికి పాల్పడ్డాడు. కొలంబియా యూనివర్సిటీ రీసెర్చ్‌ స్కాలర్‌ అయిన బాధితురాలు.. రీసెర్చ్‌ పనిమీద తాను ఫారుఖీని కలిశానని, ఆ తర్వాత 2015 మార్చి 28న తన ఇంటికి డిన్నర్‌ కోసం అని పిలిచి.. తనపై అత్యాచారం అతను జరిపాడని పోలీసులకు తెలిపింది. ఈ కేసులో తాను అమాయకుడినని ఫారుఖీ వాదించాడు. అయితే, గత నెల ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. రైతు ఆత్మహత్యలపై తెరకెక్కిన సెటైరికల్‌ మూవీ ‘పీప్లిలైవ్‌’కు ఫారుఖీ సహా దర్శకుడిగా వ్యవహరించగా.. ఆయన భార్య అనూష రిజ్వీ ఈ సినిమాకు దర్శకురాలు.

Advertisement
Advertisement