ఇండియన్ మలాలా... మరియం సిద్ధిఖీ..! | Sakshi
Sakshi News home page

ఇండియన్ మలాలా... మరియం సిద్ధిఖీ..!

Published Mon, Sep 14 2015 4:19 PM

ఇండియన్ మలాలా... మరియం సిద్ధిఖీ..!

ఆమె ప్రస్తుతం నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలాను తలపిస్తోంది. పేద బాలికల అభ్యున్నతే ధ్యేయంగా... వారికి  విద్య సులభతరం చేయాలన్నదే ఆశయంగా ముందుకు సాగుతోంది.  పలు పోటీల్లో పాల్గొని గెలిచి, అలా వచ్చిన నగదును పేద విద్యార్థులకు  విరాళంగా అందిస్తోంది.

ఇటీవల ఇస్కాన్ నిర్వహించిన భగవద్గీత పోటీల్లో అగ్రస్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరచిన ముస్లిం బాలిక మరియం సిద్ధిఖీ.. చిన్న వయసులోనే తన ప్రతిభను ప్రదర్శించడంతోపాటు ఆమె దాతృత్వాన్ని,  సేవా దృక్పథాన్ని చాటుతోంది. మహారాష్ట్రలోని 195 పాఠశాలల నుంచి 4వేల మంది విద్యార్థులు పాల్గొన్న పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకొని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సంస్థల నుంచే కాక దేశం నలుమూలల నుంచి పలువురి ప్రశంసలు అందుకుంది.  ప్రస్తుతం తనకు బహుమతిగా వచ్చిన డబ్బును సిద్ధిఖీ... పేద బాలికల విద్యకోసం విరాళంగా ఇచ్చింది.

ప్రభుత్వం పేద బాలికలకు మెరుగైన విద్య అందించేందుకు ఏర్పాటుచేసిన పథకాల ద్వారా తన బహుమతి నగదును కూడా వారికి వినియోగించాలని మరియం సిద్ధిఖీ అభ్యర్థించింది. గుజరాత్ ముఖ్యమంత్రి అనందిబెన్ పటేల్, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్లు సిద్ధిఖీని సత్కరిస్తున్న సమయంలో ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించింది.

ముంబై మహానగరం థానేలోని మీరారోడ్ వద్ద నివసించే ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మరియం సిద్ధిఖీ తండ్రి పేరు ఆసిఫ్ సిద్ధిఖీ. ఓ హిందీ పత్రికలో ఎడిటర్గా పనిచేస్తున్నారు. ''మేము ఆర్థికంగా వెనుకబడ్డవారమే అయినా... మా అమ్మాయి పేద బాలల అభ్యున్నతి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే తన బహుమతి నగదును పేదవిద్యార్థులకు వినియోగించేందుకు విరాళంగా ఇచ్చేసింది'' అని  సిద్ధిఖీ తండ్రి అసిఫ్ చెబుతున్నారు. ఆమె త్వరలో మధ్యప్రదేశ్ సీఎంను కూడా కలసి తన ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. తాను చదివిన మీరారోడ్ లోని కాస్మోపాలిటన్ హైస్కూల్తో పాటు కొన్ని ప్రదేశాల్లో పర్యటించి, పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు, డబ్బును పంచారు.

Advertisement
Advertisement