బాలికను బంధించి అత్యాచారం | Sakshi
Sakshi News home page

బాలికను బంధించి అత్యాచారం

Published Wed, Jul 13 2016 9:07 PM

బాలికను బంధించి అత్యాచారం - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: దొంగ పెళ్లితో నమ్మించి, ఇంట్లో బంధించి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. తిరునెల్వేలి జిల్లా వన్నార్‌పేట్టైకి చెందిన ఇమ్మాన్యుయేల్ (24) తిరుపూరులోని ఒక మిల్లులో పనిచేస్తున్నాడు. అతని అక్క సెల్వి మానూరు సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తోంది. అక్క ఇంటికి తరచూ వచ్చే ఇమ్మాన్యుయేల్‌కు ఆ గ్రామంలోని ప్లస్‌టూ చదువుతున్న బాలిక (17)తో స్నేహం ఏర్పడింది. గత నెల పదో తేదీన బాలికను తిరుపూరుకు తీసుకెళ్లి అక్కడి గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకుని అక్కడే ఒక ఇంట్లో కాపురం పెట్టాడు.

ప్రతిరోజూ పనికి వెళ్లేటప్పుడు బాలికను ఇంట్లోనే ఉంచి తాళం వేసేవాడు. రాత్రి తిరిగి వచ్చేవరకు బాలికను ఇంట్లోనే బందీగా ఉంచేవాడు. ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్‌కు అతడి తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారు. దీంతో బాలికను వదిలించుకునేందుకు మాయమాటలు చెప్పి ఈనెల 5వ తేదీన కారులో తీసుకెళ్లి ఊరి అవతల వదిలి వెళ్లిపోయాడు. తనకు జరిగిన అన్యాయాన్ని తల్లికి చెప్పి ఇద్దరూ కలిసి బుధవారం ఇమ్మాన్యుయేల్ అక్క ఇంటికి వెళ్లగా అక్క సెల్వి, ఆమె భర్త నటరాజన్ వీరిపై దాడిచేసి తరిమికొట్టారు. తిరునెల్వేలి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement