పరువు కోసం.. నా భార్యను చంపేశారు! | Sakshi
Sakshi News home page

పరువు కోసం.. నా భార్యను చంపేశారు!

Published Tue, Jul 26 2016 7:19 PM

పరువు కోసం.. నా భార్యను చంపేశారు! - Sakshi

కుటుంబ పరువు కోసం తన భార్యను అ‍త్తమామలే చంపేశారంటూ పాకిస్థాన్లో ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ముఖ్తర్ కజీమ్ అనే ఆ వ్యక్తి పంజాబ్ రాష్ట్రంలోని జీలం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య సామియా షహీద్ (28) బ్రిటిష్ - పాకిస్థానీ జాతీయురాలని, తాము రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని దుబాయ్లో ఉంటున్నామని చెప్పాడు. సామియా బ్రాడ్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యుటీషియన్ కోర్సు చేసింది.

అయితే.. పెద్దల ఆమోదం లేకుండా పెళ్లి చేసుకున్నామన్న కోపంతో వాళ్లు తన భార్యను చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆమె సహజంగానే మరణించిందని, అందువల్ల విచారణ అక్కర్లేదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. సామియా మరణించిన వెంటనే అటాప్సీ చేయించామని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని గ్రామంలో పూడ్చిపెట్టారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహ్మద్ అఖీల్ అబ్బాస్ తెలిపారు. అయితే ఆమెకు బ్రిటిష్ మూలాలు కూడా ఉండటంతో.. బ్రిటిష్ విదేశాంగ శాఖ కూడా దీనిపై కలగజేసుకుంటోంది.

పాకిస్థాన్లో బంధువులకు తీవ్ర అనారోగ్యంగా ఉందని తెలియడంతో కజీమ్, సామియా జూలై 14న ఇస్లామాబాద్ వెళ్లారు. సామియా గత గురువారమే తిరిగి దుబాయ్ రావాల్సి ఉంది. కానీ ఆమె గుండెపోటుతో  మరణించినట్లు ఆమె బంధువు ఒకరు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పరువు కోసమే ఆమెను చంపించడానికి వాళ్లు అనారోగ్యం నాటకం ఆడారని కజీమ ఆరోపిస్తున్నాడు.

Advertisement
Advertisement