చెన్నై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన బాగా కష్టపడే మనిషి అని, తనకు మంచి స్నేహితుడని అభివర్ణించారు. తమిళ దినపత్రిక ‘దినమలర్’కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఈ కితాబులిచ్చారు. అయితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో ముందస్తు పొత్తు అవకాశంపై సమాధానాన్ని దాటవేశారు. మోడీపై మీ వ్యక్తిగత అభిప్రాయమేంటని అడగ్గా, ‘తీరికలేని మోడీ ఎన్ని కల ప్రచారం ఆయన కష్టపడే మనిషని చెబుతోంది. ఆయన నాకు మంచి మిత్రుడు కూడా’ అని కరుణ బదులిచ్చారు. మతతత్వ శక్తులతో చేతులు కలపబోనని ఇటీవల వ్యాఖ్యానించింది బీజేపీని ఉద్దేశించేనా అని అడగ్గా, ‘బీజేపీ మతతత్వ పార్టీ అని మీరు ప్రకటిస్తున్నారా?’ అని ఎదురు ప్రశ్నించారు.
ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు, తాను ఊహాగానాలు చేయనని, ఎన్నికల తర్వాత ఏ పరిస్థితి వస్తుందో చెప్పలేనన్నారు. బీజేపీతోనే కాకుండా కాంగ్రెస్తోనూ పెట్టుకునే అవకాశం లేదని ఇటీవల చెప్పిన కరుణ ఇప్పుడిలా సమాధానం దాటేయడం గమనార్హం. మోడీపై కరుణ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, వాటికి రాజకీయ ప్రాధాన్యం లేదని డీఎంకే ప్రతినిధి ఇలంగోవన్ అన్నారు.