ప్రవాస భారతీయుల సంతాపం | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయుల సంతాపం

Published Wed, Jul 29 2015 1:27 AM

Non-resident Indian condolence

వివిధ రాష్ట్రాల్లో స్మృతి చిహ్నాల ఏర్పాట్లకు కృషి
 
వాషింగ్టన్: కలాం మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయులు, భారతీయ సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశాయి. కలాం నిరాడంబరత, నిగర్వశీలత, స్ఫూర్తినిచ్చే ఆయన వ్యక్తిత్వం ఆయనను అందరికీ ప్రీతిపాత్రుడిని చేశాయని కొనియాడాయి. భారత ముద్దుబిడ్డ అయిన కలాం నిజంగా ప్రజల రాష్ట్రపతి అని కీర్తించాయి. ‘మిసైల్ మ్యాన్’ కలాం ప్రపంచ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటారని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నివాళులర్పించారు.  నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ తదితర సంఘాలు కలాం మృతిపట్ల సంతాపం ప్రకటించిన సంస్థల్లో ఉన్నాయి. సింగపూర్ ప్రధాని  లూంగ్ కూడా సంతాపం తెలిపారు. భారత అణు సామర్థ్యాలను పెంపొందించటంలో కలాం ఎంతో కృషి చేశారని అమెరికా మీడియా శ్లాఘించింది.

 పలు రాష్ట్రాల్లో కలాం స్మృతి చిహ్నాలకు ఏర్పాట్లు
 న్యూఢిల్లీ: కలాం స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేసేందుకు పలు రాష్ట్రాలు కృషి మొదలుపెట్టాయి. బిహార్ సీఎం నితీశ్‌కుమార్.. కిసాన్‌గంజ్ వ్యవసాయ కళాశాలకు మంగళవారం డాక్టర్ కలాం పేరు పెట్టారు. మధ్యప్రదేశ్‌లో స్కూళ్లలో పాఠ్యాంశంగా కలాం జీవితచరిత్రను బోధించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్ తెలిపారు. కలాంకు నివాళిగా ఆగస్టు 2న ఆదివారం కూడా విధులు నిర్వర్తించాలని కేరళ రాష్ట్ర మహిళాభివృద్ధి కార్పొరేషన్ నిర్ణయించింది. కలాం మృతిపై ఆర్‌ఎస్‌ఎస్ సంతాపం తెలిపింది కలాం ట్విటర్ ఖాతాను మిత్రులు ‘ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం’గా కొనసాగించనున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement