చనిపోయాడనుకున్న వ్యక్తి సజీవంగా వచ్చాడు | Sakshi
Sakshi News home page

చనిపోయాడనుకున్న వ్యక్తి సజీవంగా వచ్చాడు

Published Fri, Jul 3 2015 2:04 AM

person was alive not dead

టీనగర్: మృతిచెందినట్లు ఖననం చేయబడిన వ్యక్తి రాత్రి సజీవంగా ప్రత్యక్షం కావడంతో సంచలనం ఏర్పడింది. విల్లుపురం జిల్లా, ఉలుందూరుపేట, పట్టణ పంచాయితీ, ఈశ్వరన్ కోవిల్ వీధి, సముద్రకుళం ప్రాంతానికి చెందిన కలియన్ (70) కూలి కార్మికుడు. ఇతనికి షణ్ముగం, మురుగన్, కాత్తవరాయన్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఇంట్లో కుమారులతో గొడవ పడి కలియన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కలియన్ కోసం కుమారులు గాలిస్తూ వచ్చారు. దీనిగురించి ఉలుందూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశా రు. గత ఏడాది 2014 ఆగస్టు 28వ తేదీన విల్లుపురం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఒక గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు ఉలుందూరుపేట పోలీసుస్టేషన్ కు సమాచారం అందింది.

ఉలుందూరుపేట పోలీసులు కలియన్ కుమారులను పిలిపించి అక్కడున్న మృతదేహాన్ని చూపించారు. అక్కడ అతన్ని తండ్రిగా భావించిన కుమారులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపించి పాతిపెట్టారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో మృతిచెందినట్లు భావిం చబడిన కలియన్ ఉలుందూరుపేటలోగల తన ఇంటికి చేరుకున్నాడు. ఇతన్ని గమనించిన ఇరుగుపొరుగువారు భయంతో పరుగులు తీశారు. తర్వాత దగ్గరకు వచ్చి చూసి అతన్ని కలియన్‌గా గుర్తించి ఆశ్చర్యానికి లోనయ్యారు. మూడేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కలియన్ ఒక ఆశ్రమంలో గడిపినటు తెలి పాడు. దీంతో ఖననం చేయబడిన వ్యక్తి ఎవరు? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement