ఇందిరాగాంధీ హత్య అతనికి ముందే తెలుసు | Sakshi
Sakshi News home page

ఇందిరాగాంధీ హత్య అతనికి ముందే తెలుసు

Published Fri, Jul 22 2016 6:19 PM

ఇందిరాగాంధీ హత్య అతనికి ముందే తెలుసు

లండన్: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హత్యోదంతానికి సంబంధించిన సంచలన విషయం ఒకటి వెల్లడైంది. ఇందిర హత్యకు గురవుతారన్న సంగతి ఓ వ్యక్తికి ముందే తెలుసని బ్రిటన్ గురువారం విడుదల చేసిన ఓ డాక్యుమెట్ లో బయటపడింది. ఆ వ్యక్తి పేరు జగ్జీత్ సింగ్ చౌహాన్. ఇతను యూకేలో ఉంటూ ఖలిస్థాన్ ఉద్యమంపై అనేక ఆందోళనలను చేశాడు. 'సిఖ్ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్' పేరుతో సంస్థను స్థాపించిన చౌహాన్.. పలు మార్లు సంచలన ప్రకటనలు చేసేవాడు.

ఇందిరా గాంధీ మరొకొద్ది నెలల్లో హత్యకు గురవుతుందనే విషయం జగ్జీత్ సింగ్ చౌహాన్ కు తెలుసని, ఆయన ప్రకటనలు బ్రిటన్, భారత్ ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపేవిగా ఉండేవని, అందుకే నాటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ చౌహాన్ పై చర్యలకు ఉపక్రమించిందని డాక్యుమెంట్లలో వెల్లడైంది. భారత ప్రభుత్వం కూడా చౌహాన్ పై బ్రిటన్ కు ఫిర్యాదు చేసినట్లు, ఇందిరతోపాటు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా మరణిస్తాడని చౌహాన్ విచారణాధికారులకు చెప్పినట్లు  డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది.

ఎవరీ చౌహాన్?

ఖలిస్థాన్ ను ప్రత్యేక దేశంగా పరిగణించాలంటూ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తుల్లో ముఖ్యుడు  జగ్జీత్ సింగ్ చౌహాన్. పంజాబ్ లో పుట్టిపెరిగిన ఇతను వైద్య విద్య పూర్తిచేసి డాక్టర్ గా సేవలందిచేవాడు. కొద్ది కాలం తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. పంజాబ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గానూ పనిచేసిన చౌహాన్.. 1971లో లండన్ కు వలసవెళ్లారు. అక్కడ  'సిఖ్ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్' సంస్థ ద్వారా ఖలిస్థాన్ ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రత్యేక ఖలిస్థాన్ కోసం పాక్, అమెరికా, కెనడాల మద్దతు కూడగట్టేందుకు విఫలయత్నం చేశారు. 2001లో ఇండియాకు తిరిగొచ్చిన ఆయన ఖల్సా రాజ్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పెద్దగా జనాదరణ పొందలేకపోయింది. 2007లో 78 ఏళ్ల వయులో చౌహాన్ మరణించారు.

Advertisement
Advertisement