చీరలోనే రావాలి.. చుడీదార్‌కు నో ఎంట్రీ..! | Sakshi
Sakshi News home page

చీరలోనే రావాలి.. చుడీదార్‌కు నో ఎంట్రీ..!

Published Wed, Nov 30 2016 3:30 PM

చీరలోనే రావాలి.. చుడీదార్‌కు నో ఎంట్రీ..!

తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నెలకొన్న వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు బుదవారం కొందరు మహిళా భక్తులు చుడీదార్లు ధరించిన ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అర్చకు, అధికారులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదులాట చోటుచేసుకుంది. జడ్జి తీర్పును నిరసిస్తూ కొందరు భక్తులు రోడ్డుపై బైఠాయించారు.
 
తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశించే మహిళలు చీరలు మాత్రమే ధరించాలని ఏళ్లుగా రాసుకోని కట్టుబడి కొనసాగుతోంది. ఈ విధానాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త రియా రాజి కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం మంగళవారం తీర్పు చెప్పిన హైకోర్టు.. ‘చుడీదార్లు ధరించి కూడా ఆలయంలోకి వెళ్లొచ్చు’అని స్పష్టం చేసింది. కానీ ఆలయ సిబ్బంది, అర్చకులు, అధికారులు మాత్రం చుడీదార్లు వేసుకుని వచ్చిన మహిళలను లోనికి అనుమతించలేదు.
 
దీనిపై పద్మనాభస్వామి ఆలయం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కేఎన్‌ సతీశ్‌ మాట్లాడుతూ తమకు జిల్లా జడ్జి ఆలయానికి రాసిన లేఖలో ‘విచక్షణను అనుసరించి’ నిర్ణయం తీసుకోవాలన్నారని, సంబంధిత ఆదేవాలు కూడా అస్పష్టంగా ఉన్నాయని, అందుకే చుడీదార్లలో వచ్చిన మహిళలను లోపలికి అనుమతించలేదని చెప్పారు. మరోవైపు చుడీదార్‌ మహిళల ప్రయత్నాన్ని నిరసిస్తూ కొందరు భక్తులు ఆందోళకు దిగారు. ఏక వ్యక్తులుగా జడ్జిలు తీసుకునే నిర్ణయాలు అసంబద్ధంగా ఉన్నాయంటూ రోడ్డుపై బైఠాయించారు. ఇదే అంశంపై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ను మీడియా ప్రశ్నించగా..‘కాలానుగునంగా చాలా ఆలయాల నియమాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రస్తుతం పద్మనాభస్వామి ఆలయం వద్ద నెలకొన్న పరిస్థితిపై అధికారులతో మాట్లాడతానన’ని చెప్పారు.

Advertisement
Advertisement