కొత్త పార్టీ ఏర్పాటు.. గుర్తు మోటార్‌ సైకిల్? | Sakshi
Sakshi News home page

కొత్త పార్టీ ఏర్పాటు.. గుర్తు మోటార్‌ సైకిల్?

Published Wed, Jan 11 2017 6:11 PM

కొత్త పార్టీ ఏర్పాటు.. గుర్తు మోటార్‌ సైకిల్? - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లేనా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. అందులోనూ సాక్షాత్తు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవే ఈ విషయం చెబుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. రాంగోపాల్ యాదవ్ కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారని, దానికి మోటార్ సైకిల్ గుర్తును ఆయన తీసుకున్నారని ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. దానికి 'అఖిల భారతీయ సమాజ్‌వాదీ పార్టీ' అని పేరు కూడా పెట్టినట్లు చెప్పారు. 
 
తాజాగా ములాయం, అఖిలేష్‌ యాదవ్‌ల మధ్య జరిగిన సమావేశంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవి విషయంలో ఇద్దరూ రాజీ పడలేదని తెలుస్తోంది. ఎన్నికల గుర్తు సైకిల్ కోసం ఇరు వర్గాలు దాఖలు చేసుకున్న పిటిషన్లను ఉపసంహరించుకోవాలని ములాయం చేసిన ప్రతిపాదనను కూడా అఖిలేష్ తోసిపుచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కావాలంటే శివపాల్ యాదవ్, అమర్‌సింగ్‌లను ఈ ఎన్నికల నుంచి పక్కకు పెట్టడానికి సరేనన్న ములాయం.. అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడానికి మాత్రం ససేమిరా అన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడిగా తానే ఉంటానని, ఇన్నాళ్లూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాంగోపాల్ యాదవ్ అనుభవించిన అధికారాలన్నింటినీ అఖిలేష్‌కు ఇస్తానని కూడా ములాయం ప్రతిపాదించారు. అంటే, రాంగోపాల్ యాదవ్‌ను మాత్రం పార్టీ నుంచి బయటకు పంపాలన్నదే ములాయం ప్రతిపాదనగా తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement