టీచర్‌ను 28 సార్లు పొడిచి.. చంపేశారు! | Sakshi
Sakshi News home page

టీచర్‌ను 28 సార్లు పొడిచి.. చంపేశారు!

Published Sat, May 13 2017 4:08 PM

టీచర్‌ను 28 సార్లు పొడిచి.. చంపేశారు! - Sakshi

ఆమె అంటే ఎవరికి.. ఎందుకు కోపం వచ్చిందో తెలియదు గానీ, ఓ స్కూల్ టీచర్‌ను ఏకంగా 28 సార్లు కత్తితో పొడిచి పొడిచి మరీ చంపేశారు. హరియాణాలోని పంచకుల సెక్టార్-20లోని మార్కెట్‌ వద్దకు పిజా కొనుక్కోడానికి తన 15 ఏళ్ల కొడుకుతో కలిసి వెళ్లిన కొద్ది సేపటికే ఈ హత్య జరిగింది. మృతురాలు రీనాదేవి (39) స్కూల్ టీచర్‌. ఆమె చండీమందిర్ కంటోన్మెంటు ప్రాంతంలో గల శౌర్య ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చేస్తున్నారు. గురువారం రాత్రి 9.30 వరకు మార్కెట్‌లోని పిజా షాపు వద్దే ఉన్న ఆమె.. ఆ తర్వాత తన కారుతో సహా ఆమె అదృశ్యం అయ్యారు. అర్ధరాత్రి తర్వాత చండీమందిర్ - రామ్‌గఢ్ రోడ్డులోని భందెర్ ఘాటి వద్ద తన కారులోనే ఆమె దారుణంగా హత్యకు గురై కనిపించారు. ఆమె తన ఇద్దరు కొడుకులతో కలిసి సెక్టార్ 20 సమీపంలోని పీర్ ముచల్లా వద్ద ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఆమె భర్త సందీప్ కుమార్ ఆర్మీలో చేసి రిటైరయ్యారు. ఆయన బడ్డి వద్ద గల ఓ ఫ్యాక్టరీకి సెక్యూరిటీ ఇన్‌చార్జి. వారాంతాల్లో కుటుంబం వద్దకు వస్తారు.

పోలీస్ కంట్రోల్ రూం సిబ్బంది వ్యాన్‌లో పెట్రోలింగ్ చేస్తుండగా రీనాదేవి కారు కనిపించింది. అందులో ఆమె మృతదేహం రక్తపు మడుగులో ఉంది. ఆమెను ఏదో పదునైన ఆయుధంతో పొడిచారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమెకు మొత్తం 50 గాయాలు కాగా, వాటిలో 28 పొడిచిన గాయాలు. చాలావరకు గాయాలు ఆమెకు ఎడమవైపు కాగా, కుడివైపు చేతిమీద, తల మీద కూడా కొద్దిపాటి గాయాలయ్యాయి. గుండెలోను, ఊపిరితిత్తుల్లో కూడా కత్తిపోట్లు దిగడంతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆమె మరణించారని వైద్యులు తెలిపారు. అత్యాచారం మాత్రం జరగలేదని స్పష్టం చేశారు. కారులో రెండు సీసాల మద్యం, చాలా సిగరెట్ పీకలు, ఒక హెల్మెట్ ఉన్నాయి. దాన్నిబట్టి హత్యకు చాలాసేపటి ముందు నుంచి కారులో ఆమెతో పాటు వేరే ఎవరో ఉన్నట్లు అర్థమైంది. తన తల్లి మార్కెట్‌ నుంచి అదృశ్యం అయినా 15 ఏళ్ల కొడుకు ఎందుకు ఎవరికీ చెప్పలేదన్నది అర్థం కావట్లేదు. ఎవరో బాగా కోపం, కసితోనే ఆమెను అన్నిసార్లు పొడిచినట్లుందని పోస్టుమార్టం చేసిన వైద్యులు చెప్పారు.

Advertisement
Advertisement