ముంబై:
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(శనివారం) వెల్లడికానున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు స్వల్పలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 17.10 పాయింట్ల లాభంలో 28,946.23 వద్ద, నిఫ్టీ 7.55 పాయింట్ల లాభంలో 8934.55 వద్ద సెటిల్ అయింది. బీజేపీకే జై కొడుతూ ఎగ్జిట్ పోల్స్ నిన్న విడుదల కావడంతో నేటి మార్నింగ్ సెషన్లో మార్కెట్లు పాజిటివ్ గా ఎంట్రీ ఇచ్చాయి. సుమారు 150 పాయింట్ల మేర పైకి ఎగిశాయి. అయితే మధ్యాహ్న ట్రేడింగ్ కు వచ్చే సరికి మార్కెట్లు ఆచితూచి అడుగులు వేయడం ప్రారంభించాయి. పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ విశ్వసించని మార్కెట్లు తుది ఫలితాల కోసం వేచిచూస్తున్నాయి.
చాలా సార్లు ఎన్నికల తుది ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ ను తలకిందుల చేస్తూ వచ్చాయని కొటక్ మహింద్రా ఏఎంసీ ఎండి నిలేష్ షా చెప్పారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని తెలుస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం ట్రేడింగ్ ఎంతో కీలకమైనదని చెప్పారు. వరుసగా మూడు రోజులు స్టాక్ మార్కెట్లు సెలవును పాటించనున్నాయి. శని, ఆది వారాలతో పాటు హోళి పండుగ సందర్భంగా సోమవారం కూడా మార్కెట్లకు సెలవు. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 8పైసలు లాభపడి 66.63గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 176 రూపాయలు పడిపోయి, 28,270గా ట్రేడైంది.