మార్కెట్లకు షాకిచ్చిన యుద్ధ వాతావరణం | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు షాకిచ్చిన యుద్ధ వాతావరణం

Published Thu, Sep 29 2016 4:10 PM

Sensex, Rupee Crash As Army Strikes At Terrorists Across Line Of Control

ముంబై: లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఏర్పడిన  యుద్ధ వాతావరణం దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు రేపింది. భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ఆరంభంలో పాజిటివ్ నోట్ తో వున్న దేశీయ స్టాక్  మార్కెట్లు భారీ పతనాన్ని చవి చూశాయి. ఒక దశలో 572  పాయింట్లకు పైగా నష్టపోయిన  సెన్సెక్స్ 465 నష్టంతో 27,827 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ  నిఫ్టీ కూడా 154పాయింట్లను కోల్పోయి 8,591 వద్ద స్థిరపడింది.  గత మూడునెలల్లో ఇదే అతి భారీ పతనమని ఎనలిస్టులు వ్యాఖ్యానించారు. 88 వేల మార్క్ దగ్గర ప్రధాన నిరోధాన్ని ఎదుర్కొన్న నిఫ్టీ  ఈ దెబ్బతో  మరో కీలక మద్దతు స్థాయి 86వేల దిగువకు పడిపోయింది.   తరువాత 8,500  వద్ద కీలక మద్దతు అని, ఇక్కడ  విఫలమైతే మరింత పతనం తప్పదని మార్కెట్ ఎనలిస్టులు  అంచనా వేశారు. దాదాపు అన్ని  రంగాల సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటో, రియల్టీ రంగాలురంగాలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అటు చిన్న షేర్లూ  కుప్పకూలాయి.  ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎస్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ  స్వల్ప లాభాలను ఆర్జించగా,  భెల్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, అరబిందో, బీవోబీ, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, లుపిన్‌, ఐషర్‌, గెయిల్‌ నష్టపోయాయి.

అటు డాలర్ తో పోలిస్తే  38 పైసల నష్టంతో 66.85 దగ్గరు ఉంది. ఒక దశలో 45పైసలకు పైగా దిగజారి రూ. 67 స్థాయికి చేరువలోకి వచ్చింది.   బ్రెగ్జిట్ ఉదంతం తరువాత రూపాయి ఈ స్తాయిలో పతనం కావడం ఇదే మొదటి సారని మార్కెట్ ఎనలిస్టులు విశ్లేషించారు. అయితే  ఇటీవల నష్టాల్లో పసిడి ఈ రోజు  పుంజుకుంది.  పది గ్రా. పుత్తడి. రూ.163  లాభంతో రూ. 31,118 వద్ద ఉంది.
 

Advertisement
Advertisement