ఆయనే రాష్ట్రపతి..!! | Sakshi
Sakshi News home page

ఆయనే రాష్ట్రపతి..!!

Published Wed, Jun 14 2017 3:35 PM

ఆయనే రాష్ట్రపతి..!! - Sakshi

  • ఆయనను మించిన వారు లేరు
  • రిఫరెండం లేదా ఎన్నికలు పెడితే ఆయనే గెలుస్తారు
  • అద్వానీకే ఈ అత్యున్నత పదవికి కట్టబెట్టాలి
  • బీజేపీ ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

  • దేశ తదుపరి రాష్ట్రపతి ఎవరన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారుచేసేందుకు బీజేపీ ఇప్పటికే ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎల్‌కే అద్వానీని మించినవారు లేరని, ఆయననే రాష్ట్రపతిని చేయాలని బీజేపీ ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు.

    అద్వానీని ’పితామహుడి’గా అభివర్ణించిన శ్రతుఘ్న.. ఆయనను రాష్ట్రపతిని చేయాల్సిందేనంటూ ట్విట్టర్‌లో వరుసగా కామెంట్లు పెట్టారు. ‘అద్వానీని మించినవారు లేరు. రిఫరెండం లేదా, ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే ఆయన దారిదాపులకు కూడా ఎవరు రారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవికి అద్వానీయే ఫస్ట్‌, లాస్ట్‌ చాయిస్‌ కావాలి’ అని శత్రుఘ్న అన్నారు. ‘అద్వానీ ఈ గౌరవానికి ఎంతగానో సరితూగుతారు. బీజేపీ పితామహుడైన ఆయనకు ఈ గౌరవాన్ని అందించే ఆలోచన పార్టీలోని అందరికీ రావాలని నేను కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా. లాంగ్‌లివ్‌ అద్వానీ, లాంగ్‌లివ్‌ బీజేపీ. జైహింద్‌’ అని ఆయన ట్వీటారు.

    అద్వానీకి శత్రుఘ్న సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందే. అద్వానీకి సన్నిహితంగా ఉండటం వల్లే ప్రస్తుతం ఆయనను పార్టీలో పక్కనబెట్టారని, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అద్వానీపై తన గుర్తుభక్తిని చాటుకుంటూ శత్రుఘ్న పెట్టిన ఈ ట్వీట్‌ బీజేపీ అధినాయకత్వమైన మోదీ, అమిత్‌ షా ప్రభృతులకు చేరుతుందా? అన్నది చూడాలి.
     

Advertisement
Advertisement