Sakshi News home page

ద్విజాతి ఛాయలో కశ్మీర్ లోయ

Published Sat, Jul 16 2016 12:25 AM

ద్విజాతి ఛాయలో కశ్మీర్ లోయ

జాతిహితం

 

అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించాలంటే సైన్యాన్ని ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్‌పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారాయన.

 

 

కశ్మీర్ లోయలో జరుగుతున్న తాజా పరిణామాలన్నీ మన లోలోపలి వికృ తాలే. ఇది కశ్మీర్ భూభాగం గురించి కూడా కాదు. లేదా కశ్మీరీల గురించి అయినా కాదు. లేదంటే భారత్, పాకిస్తాన్‌ల వ్యవహారం కూడా కాదు. ఇప్పుడు ఇది హిందువులు, ముస్లింల గొడవగా తయారయింది. ఎవరికీ లబ్ధి చేకూర్చని ఇలాంటి  పరిస్థితి ఎందుకు తలెత్తింది? 

 మిగతా విషయాలు పక్కన పెట్టి ఇలాంటి వాదనలో ఉన్న కనీస తర్క బద్ధ వాస్తవాలనైనా చూద్దాం. మొదట: బుర్హన్ వనిని సాయుధదళాలు కాల్చి చంపడంతో  తాజా కల్లోలం ఆరంభమైంది. ఈ పరిణామం సంభవించ కూడ నిదేమీ కాదు. అతడు రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సోషల్ మీడియాలో హల్‌చల్ చేసినప్పుడే చావుకు అత్యంత సమీపంగా వచ్చాడని అర్థమైంది. నిజానికి ఇంతకాలం జీవించి ఉన్నాడంటే అదంతా అతడి చాక చక్యమే. పెద్ద వింత కూడా. సాయుధబలగాల దృష్టిలో పడి, వారు వెతుకు తున్న వారి ‘ఏ’ జాబితాలో పేరు ఎక్కిన ఆరేళ్ల తరువాత కూడా బతికి బట్ట కట్టడం మామూలుగా సాధ్యంకాదు.

 

అతడి పట్ల నేను సానుభూతితో ఉండాలా? సోదర భారతీయుడు ఎవరు మరణించినా నేను దుఃఖిస్తాను. అయితే బుర్హాన్ వని పట్ల కొంత వరకు నేను సానుభూతి చూపాలి. ఇలాంటి ప్రాణాంతకమైన మార్గంలోకి అతడు వెళ్లేటట్టు మిత్రులు, కుటుంబం అతడిని అనుమతించినందుకు, బహుశా అలాంటి దానికి ప్రోత్సహించినందుకు కూడా నేను సానుభూతి చూపవచ్చు. అతడు మరణించిన తీరుకు కూడా సానుభూతితో ఉండవచ్చు. కానీ ఒకసారి ఆయుధం చేపట్టి జనాన్ని చంపడం మొదలుపెట్టిన తరువాత చట్టేతర విధానాలతో చంపుతున్నారంటూ అవతలి వారిని ఆరోపించే కనీస నైతిక అర్హత కోల్పోయినట్టే. అయినా అలాంటి చావును అతడు స్వచ్ఛందంగా కోరుకున్నాడు. ఇది విషాదం. తరువాత డజన్ల కొద్దీ సాధారణ పౌరులు, యూనిఫారాలలో ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఇది మరింత విషాదం.

 నా వరకు, ఇంకా అశేష భారతీయ జనాభా, ధైర్యం చేసి జేఎన్‌యూ ప్రాంగణంలో నేను చెప్పినట్టు ఎలాంటి సంకోచాలు లేని వాస్తవం- కశ్మీర్, ప్రస్తుతం దేశం అధీనంలో ఉన్న ఇతర భూభాగాలు భారత్ నుంచి అవిభా జ్యాలు. గణతంత్ర భారత్‌లోని అంతర్భాగాలు. అలాగే, కొంతమంది తిట్టినా, పాకిస్తాన్, చైనాల ఆక్రమణలో ఉన్న ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం ఉన్నప్ప టికీ పాకిస్తాన్ చేతిలో ఉన్న భూభాగాలు అక్కడే ఉంటే ఉండనివ్వమనే నేనంటాను. అణ్వాయుధాలు కలిగి ఉన్న మూడు ఇరుగు పొరుగు దేశాలు కూడా యుద్ధం ద్వారా ఇతరుల భూభాగాలను దఖలు పరుచుకోలేవు.

 

ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ మూడు దేశాలలో రెండు దేశాలకు వ్యతి రేకంగా ఎవరు వ్యవహరించినా కశ్మీర్ భూభాగం, కశ్మీర్ ప్రజానీకం ఆ మూడు దేశాల దాయాదుల చిరకాల పోరులో చిక్కుకోవడం తథ్యం. కాబట్టి ఎవరూ తొందరపడరు. ఆఖరికి డజను తాజా యుద్ధాలు చేసుకున్నా, భారత్-పాక్ తమ అణ్వాయుధాలు మొత్తం వినియోగించినా కూడా ఎటు వైపు వారైనా కూడా వారి వైపు ఉన్న కశ్మీరాలను కోల్పోరని నేను పందెం కట్టి మరీ చెబుతాను. భద్రతా మండలి తీర్మానాలు కూడా పాకిస్తాన్ లేదా భారత్ లకే అవకాశం కల్పించాయి. పాకిస్తాన్ చెబుతున్న ఆజాద్ కశ్మీర్, ప్రజా భిప్రాయ సేకరణ, ఆజాదీకి మద్దతు ఇవేమీ ఇక్కడ వర్తించవు. ఇవన్నీ కపట నాటకాలే. ఆజాదీ ఏమీ లేదు. స్కాట్లాండ్ లేదు. క్విబెక్ లేదు. ఆఖరికి బ్రిక్జిట్ కూడా ఇక్కడ లేదు. ఏది ఏమైనా ఐక్యరాజ్య సమితి తీర్మానాలను, సిమ్లా ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కినది పాకిస్తానే తప్ప భారత్ కాదు. ఏడేళ్లకు ముందు సైన్యం సహాయంతో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుందామని ఆ దేశం యత్నించి పూర్తిగా విఫలమైంది.

 

కశ్మీర్‌ను కోల్పోతున్నామని భారతీయులు ఎప్పటికీ విచారించవలసిన అవసరం లేదు. అక్కడ చాలినంత  సైన్యం ఉంది. మన భూభాగంలోని ఆ లోయను రక్షించుకోవాలన్న మన ఆశయం వజ్ర సదృశంగా ఉంది. ‘‘మన’’ కశ్మీరీలు అనేది ఇప్పుడు ఒక అంశమే కాదు, అంతకు మించిన వివాదాస్పద అంకంలోకి ప్రవేశిస్తున్నాం. పౌరులనీ, భూభాగాలనీ సైన్యాలు కాపాడగలవు. కానీ ఆగ్రహంతో ఉన్నవారి మనసును సైన్యం మార్చలేదు.

 

ఈ మాటని చాలా మంది సైనికులు, మిత్రులు వెంటనే అంగీకరిం చలేరు. అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించా లంటే సైన్యం ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్‌పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారా యన. అదే ఆరేళ్ల పాటు రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పింది. ఆ బాటలోనే మన్మోహన్‌సింగ్ ప్రయాణించారు. భారతదేశ సంకీర్ణ ప్రభుత్వాల చరిత్రలోనే అసంభవం అనదగ్గ తీరులో ముఫ్తీ స్థాపించిన పీడీపీతో బీజేపీ జత కట్టిన దృష్ట్యా నరేంద్ర మోదీ కూడా ఇలాగే వ్యవహరించగలరని మనం ఊహించాం.

 

కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి పరిస్థితులు ఇంతగా విషమించడానికి కారణం- సంకీర్ణం ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం గురించి బీజేపీ తన కార్యకర్తలకు సరిగా ప్రచారం చేయలేదు. మరీ ముఖ్యంగా తన సిద్ధాంతకర్తలకీ, మేధావి వర్గానికీ, అజెండా నిర్ణేతలకీ కూడా ఉద్దేశాన్ని ఎరుక పరచలేదు. సైద్ధాంతికంగా ఎడమొహం పెడ మొహంగా ఉండే రెండు విభిన్నశక్తులు జాతీయతా సూత్రంతో (ముఫ్తీ గురించి ఆయన రాజకీయాల గురించి కూడా నేను ఇదే చెబుతాను) ఒకే తాటిపైకి వచ్చాయి. ఎన్నికలు తెచ్చిన విభజనను అధిగమించి ఐక్యత సాధించే ఉద్దేశంతో అవి ఈ పనిచేశాయి. అందుకే ఈ సంకీర్ణం భేషజంతో కాకుండా, రాజనీతిజ్ఞతతో వచ్చిందని అంటాను. జమ్మూ కశ్మీర్‌లో ద్విజాతి సిద్ధాంతంతో సమానమైన సిద్ధాంతానికి తెర తీసిన ఎన్నికలవి.

 

ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలో ఒక రకంగాను, ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మరో తీరు లోను ఓటింగ్ జరిగింది. పీడీపీతో భాగస్వామ్యానికి నరేంద్ర మోదీ చొరవ చూపినప్పటికీ, ఆయన పార్టీ కార్యకర్తల సిద్ధాంతం, మోదీ రాజకీయ వాస్త వాలు ఆయనను వెనక్కు తగ్గేటట్టు చేశాయి. బాధితుల పట్ల చిన్నపాటి సానుభూతి మాట కూడా చెప్పకుండా, వారు దేని గురించి అడుగుతున్నారో కూడా ప్రస్తావించకుండా కశ్మీర్‌లో భద్రతాదళాల కార్యకలాపాలను సమర్థించ డానికి రోజూ సాయంకాలం మోదీగారి పార్టీ వక్తలు టీవీ స్టూడియోల చుట్టూ ఎలా తిరుగుతున్నారో మనమంతా చూస్తున్నాం. సంకీర్ణ భాగస్వామిని ఆదు కోవడమన్న పేరుతో బీజేపీ చేస్తున్న ఈ పని వికృతమైనదే కాదు, స్వీయ విధ్వంసకమైనది కూడా.

 

కశ్మీర్ మొత్తం మనదే అంటూ నినదించేవారు, గుండెలు బాదుకునే వారు కశ్మీర్ అంటే వారి దృష్టిలో ఒక్క భూభాగమా లేక కశ్మీరీలు కూడానా? అన్న ప్రశ్న వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే తమకు విధేయులుగా (హిందు వులు, బౌద్ధులు) ఉండేవారేనా? అని కూడా ప్రశ్నించుకోవాలి. అలాగే ముస్లింలు కోరుకుంటే వారు పాకిస్తాన్ వెళ్లిపోవాలన్నదే తమ వాంఛితమా? వాస్తవంగా మనసులో ఉన్నది అదే అయితే, విభజన తరువాత అసం పూర్ణంగా మిగిలిన అజెండాయే కశ్మీర్ అంటూ పాకిస్తాన్ ఇప్పటివరకు అడ్డూ అదుపు లేకుండా దేని గురించి మాట్లాడుతున్నదో మీరు కూడా అదే మాట్లా డుతున్నారు. ఆ భూభాగాన్ని, కొంత జనాన్ని (ముస్లింలు) వారు కోరు తున్నారు. మనం కూడా అంతే, ఆ భూభాగం, కొంత జనం కావాలని కోరు తున్నాం. విభజించు పాలించు అన్న సూత్రం మనకి బ్రిటిష్ జాతి నేర్పింది. మనం మాత్రం విభజించు- వదులుకో అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం.

 

నిజానికి 97 శాతం ముస్లింలు భారతదేశంలోని ప్రధాన భూభాగంలోనే నివశిస్తున్నారు. వీరి దేశభక్తిని నిరంతరం శంకించినప్పటికీ వీరు ఏనాడూ కశ్మీరీల నినాదంతో గొంతు కలపలేదు. ఆఖరికి కొత్త సున్నీ రైట్ సిద్ధాంత కర్తలు, అంటే జకీర్ నాయక్ వంటి వారు కూడా కశ్మీర్ అంశం గురించి ఆచి తూచి మాట్లాడుతున్నారు. ఆ సమస్యను లోయకు పరిమితంగా ఉంచడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తున్నది ఇదే.

 ఈ మార్గం గురించి ఆలోచించండి. పాకిస్తాన్ వెళ్లిపోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే సరిహద్దులు తెరిచి ఉన్నాయి అని ముస్లింలతో భారత్ చెప్పవలసి వస్తే ఎలా ఉంటుంది? ఏ ఒక్కరు భారత భూభాగం విడిచి వెళ్లరు. నా అనుమానం ఏమిటంటే, మంచి జీవనం కోసం పాకిస్తాన్, బంగ్లాల నుంచే ఇంకొందరు ముస్లింలు ఇక్కడికే రావచ్చు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వాలే మనం ఎక్కడ ఉండాలి అన్న విషయాన్ని నిర్ధారిస్తాయి. కశ్మీర్ సరిహద్దులలో కూడా ఇదే చెబితే? ఆజాదీ కశ్మీర్ గురించి కల్పనలు ఉన్న వారు, జీహాదీల వలలో పడినవారు ఏ కొందరో మినహా ఎవరూ దేశం విడి చిపోరు. కశ్మీర్‌లో ‘మన జనం’ అంటూ మాట్లాడేవారే ఇంకో ప్రశ్నను కూడా వేసుకోవాలి. ‘మన’ కశ్మీరీలు ‘వారి’ భూభాగంలో ఉండాలా? లేకపోతే భూభాగం ఇక్కడ వదిలి పాకిస్తాన్ వెళ్లిపోవాలా? దీనికి నిజాయితీతో కూడిన సమాధానం రాబట్టుకోవడం నా ఉద్దేశం కాదు. హిందూ-ముస్లిం పరి భాషతో కశ్మీర్ సమస్యను పునర్ వ్యాఖ్యానిస్తే వచ్చే ప్రమాదం ఏమిటో ఆలో చించాలనే నా ఉద్దేశం. అలాగే కనుక ఆలోచిస్తే కశ్మీర్‌ని పోగొట్టుకోకపోవచ్చు. కానీ కశ్మీరీలను పోగొట్టుకుంటాం.

 

- శేఖర్ గుప్తా

twitter@shekargupta

Advertisement

What’s your opinion

Advertisement