24 గంటల్లో ఆయనను గెంటేయండి! | Sakshi
Sakshi News home page

24 గంటల్లో ఆయనను గెంటేయండి!

Published Sun, Aug 14 2016 5:48 PM

24 గంటల్లో ఆయనను గెంటేయండి!

ముంబై: జమ్ముకశ్మీర్‌ విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్ బాసిత్‌ పై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడిన బాసిత్‌ను 24 గంటల్లోగా పాకిస్థాన్‌కు పంపించాలమని డిమాండ్‌ చేసింది.

శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రావత్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 'ఢిల్లీలో కూర్చుని ఆ వ్యక్తి భారత్‌కు వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నాడు. అతన్ని 24 గంటల్లోగా వెంటనే ఇస్లామాబాద్‌కు పంపించేయాలి. మన స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు అతను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడా? అతనిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం' అని పేర్కొన్నారు. ఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ కార్యాలయాన్ని, ముంబైలోని పాక్‌ రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా పాక్‌ హైకమిషనర్‌ వ్యాఖ్యల్ని ఖండించింది.

ఆదివారం (ఆగష్టు 14న) పాకిస్థాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్ బాసిత్‌ కశ్మీర్‌ విషయమై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని కశ్మీర్ విముక్తికి అంకితం చేస్తున్నాం. జమ్ముకశ్మీర్ ప్రజల త్యాగాలు విజయవంతమవుతాయని మేం నమ్మకంగా ఉన్నాం' అని బాసిత్ పేర్కొన్నారు. కశ్మీర్‌ లోయలో నెలకొన్న అశాంతి విషయమై భారత్‌-పాక్‌ సంబంధాలు ఉప్పు-నిప్పులా మారిన సంగతి తెలిసిందే. ఈ సంబంధాలను మరింత దెబ్బతీసేలా.. భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా బాసిత్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement