Sakshi News home page

జల్పాయిగురిలో బాంబు పేలుడు: ఆరుగురికి గాయాలు

Published Sun, Aug 18 2013 3:07 PM

Six passengers injured in bomb blast

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో బొరొవిశ చౌపాటి వద్ద ఈ రోజు ఉదయం బస్సులో పేలుడు సంభవించి ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. గాయపడిన వారందరిని అలీపుర్ధర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. భారత్లోని అసోం నుంచి భూటాన్లోని పున్సిలింగ్ ప్రాంతానికి ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు చౌపాటి వద్ద పేలిందని తెలిపారు.

 

అయితే ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణీకులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని అధికారులు తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు.  బస్సులో బాంబును ఆగంతకులు ఎవరికి కనబడకకుండా ఉంచారని చెప్పారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
Advertisement