ధోనీపై కోహ్లికి గంగూలీ కీలక సలహా!! | Sakshi
Sakshi News home page

ధోనీపై కోహ్లికి గంగూలీ కీలక సలహా!!

Published Tue, Jan 31 2017 12:40 PM

ధోనీపై కోహ్లికి గంగూలీ కీలక సలహా!!

నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా చివరినిమిషంలో అద్భుత విజయాన్ని సాధించింది. బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, ఆశీష్‌ నెహ్రా రాణించడం వల్లే ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించగలిగింది. ఈ విజయం టీమిండియాలో విశ్వాసాన్ని పెంచినా పలు లొసుగులు ఇంకా జట్టును వెంటాడుతూనే ఉన్నాయి. వరుసగా రెండు టీ-20 మ్యాచ్‌ల్లోనూ భారత బ్యాట్స్‌మన్‌ విఫలమయ్యారు. అంచనాల మేరకు ఆడలేకపోయారు. ఈ నేపథ్యంలో సిరీస్‌ ఎవరిదో తేల్చేందుకు బుధవారం బెంగళూరులో జరుగుతున్న మూడో టీ-20లో కోహ్లి సేన బ్యాటింగ్‌ లైనప్‌పై ప్రయోగాలు చేయకతప్పదని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ సూచించారు. ముఖ్యంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ధోనీని ముందుకు పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.

'బెంగళూరులో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చాల్సిన అవసరముందని నాకు అనిపిస్తోంది. నంబర్‌ 3 స్థానంలో మనీష్‌ పాండేను ఆడించాలి. మిగిలి ఉన్న ఓవర్లను బట్టి రైనాను ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే సరిపోతుంది. ఇక ఎంఎస్‌ ధోనీని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు జరపాల్సిన అవసరముంది. ఈ విషయాన్ని నేను గత నాలుగైదేళ్లుగా చెప్తున్నాను. ఇప్పుడు ధోనీ చాలా స్వేచ్ఛగా, అత్యుత్తమంగా ఆడుతున్నాడు. కాబట్టి అతన్ని ముందుగా పంపడం మంచిది. కానీ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భేటీ అయి.. సరైన నిర్ణయం తీసుకుంటుంది' అని గంగూలీ మీడియాతో పేర్కొన్నారు.

Advertisement
Advertisement