Sakshi News home page

ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక అలవెన్స్‌లు

Published Tue, Sep 15 2015 2:23 AM

Special Allowances to Traffic staff

- కానిస్టేబుల్‌కు రూ. 2,500, హెడ్ కానిస్టేబుల్‌కు రూ. 3 వేలు
- ఏఎస్సైకి రూ. 3,500, ఎస్సైకి రూ. 4,000, సీఐకి రూ. 4,500
- 2 వేల మందికి లబ్ధి.. రెండ్రోజుల్లో ఉత్తర్వులు
 
 సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసు సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వరాల జల్లు కురిపించనుంది. నిత్యం పొగ, దుమ్మూ ధూళి, శబ్ద కాలుష్యంలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీనెల జీతంతో పాటు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానిస్టేబుల్‌కు జీతంతో పాటు రూ.2,500, హెడ్ కానిస్టేబుల్‌కు రూ.3 వేలు, ఏఎస్సైలకు రూ.3,500, ఎస్సైలకు రూ.4 వేలు, సీఐలకు రూ.4,500 అదనపు అలవెన్స్‌లు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువరించేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న 1,800 మందికి, ఇతర జిల్లాల్లో దాదాపు 2 వందల మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.
 
 మూడేళ్ల నిరీక్షణ: నిత్యం కాలుష్యం మధ్య విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదన మూడేళ్ల కింద తెరపైకి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులకు జీతంతో పాటు పొల్యూషన్ అలవెన్స్ కింద అదనంగా కొంత మొత్తం చెల్లించాల్సిందిగా 2012లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న కిరణ్ హయాంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అప్పట్లో దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. పరిశీలించాల్సిందిగా ఆర్థిక శాఖకు సూచించింది. అయితే కేవలం హైదరాబాద్ ట్రాఫిక్ సిబ్బందికి మాత్రమే అదనపు అలవెన్స్‌లు చెల్లించడం వల్ల జిల్లాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయంటూ అధికారులు కొర్రీలు పెట్టారు. ఈ నేపథ్యంలో అలవెన్స్‌లపై చర్చించడం కోసం ఒక కమిటీ వేశారు. హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య, కాలుష్యం ఎక్కువ కాబట్టి ఇక్కడ పనిచేసే సిబ్బందికి జీతంలో 30 శాతం అదనపు అలవెన్స్ చెల్లించాల్సిందిగా ఆ కమిటీ సూచించింది.
 
 మిగతా జిల్లాల్లో వాహనాల సంఖ్య, వాటి నుంచి వెలువడే కాలుష్య శాతాన్ని లెక్కగట్టి సిబ్బందికి అదనపు అలవెన్స్ చెల్లించాల్సిందిగా సూచిం చింది. అయితే మూడేళ్లుగా దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలవెన్స్‌లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారిం చింది. పోలీసుశాఖకు ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్... ట్రాఫిక్ పోలీసుల విన్నపానికి సానుకూలంగా స్పందించారు. గతంలో కమిటీ ఇచ్చిన నివేదికతో సంబంధం లేకుండా అందరికీ అలవెన్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
 

Advertisement
Advertisement