- పీవోకేలో దారుణం.. రిజల్ట్స్ వెల్లడిలో జాప్యం
- ప్రశ్నించిన విద్యార్థినులపై పోలీసుల క్రౌర్యం
సాక్షి, పీవోకే: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో గత కొన్నాళ్లుగా ప్రజాగ్రహం పెల్లుబుక్కుతున్న సంగతి తెలిసిందే. పాక్ సర్కారు నియంత్రణలో ఉన్న పీవోకేలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగిత పెరిగిపోవడం, ప్రజల జీవితాలు దుర్భరంగా మారడంతో ఇక్కడ స్వాతంత్ర్యం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. పాక్ నిరంకుశ ప్రభుత్వం నుంచి తమకు విముక్తి కావాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పీవోకేలో స్వాతంత్ర్య ఉద్యమాలకు భారత్ సైతం మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా పీవోకే రావలకోట్లోని పూంచ్ మెడికల్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. పరీక్షలు రాసి చాలా రోజులు అవుతున్నా ఫలితాలు విడుదల చేయకపోవడంతో వైద్య విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఫలితాలు ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. విద్యార్థినుల ఆందోళనపై పోలీసులు తమ క్రౌర్యాన్ని ప్రదర్శించారు. అమ్మాయిలు అని చూడకుండా వారిని చితకబాదారు. ఈ ఘటనలో 15మంది అమ్మాయిలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.