కర్నాటక మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి చోటు కల్పించడంపై నిరసన వ్యక్తమవుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రివర్గాన్ని విస్తరించారు. తాజా మంత్రివర్గ విస్తరణలో అక్రమ మైనింగ్ కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న డికే శివకుమార్, భూకబ్జా కు పాల్పడ్డారనే విమర్శలు వస్తున్న ఆర్ రోషన్ బేగ్ లకు చోటు దక్కింది.
శివకుమార్, బేగ్ ల చేత గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజ్ తన అధికార నివాసంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షులు జి పరమేశ్వర్, ఇతర మంత్రులు హాజరయ్యారు. కర్నాటకలోని రామనగరం జిల్లాలోని కనకపుర నియోజకవర్గానికి శివ కుమార్, శివాజీనగర్ నియోజకవర్గానికి బేగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.