నోయిడా: టీసీఎస్ ఉద్యోగి నోయిడాలో దారుణ హత్యకు గురయ్యాడు. మీరట్కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంకిత్ చౌహాన్ ను సోమవారం సాయంత్రం దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. భార్యను ఆఫీసులో విడిచిపెట్టి, తన స్నేహితుడితో గగన్తో కలిసి వెడుతుండగా కారులో వచ్చిన ఇద్దరు దుండగులు వీరి కారును అటకాయించారు. కారు అద్దం లోంచి డ్రైవింగ్ సీట్లో ఉన్న అంకిత్పై ఒక వ్యక్తి మూడుసార్లు కాల్పులు జరపడంతో అతని మెడ, తలపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అంకిత్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కైలాస్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అంకిత్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారని డీప్యూటీ ఎస్పీ రాజ్ కుమార్ మిశ్రా వెల్లడించారు.
అంకిత్ మృతదేహాన్ని పోస్ట్మార్టంకోసం తరలించామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కారును గుర్తించామని ఆయన తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మిశ్రా తెలిపారు. కాగా అంకిత్కు మార్చి పదో తేదీన పెళ్లయిందని, అతని భార్య కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారని అతని స్నేహితుడు గగన్ తెలిపారు.