చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మంచిరెడ్డి | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మంచిరెడ్డి

Published Wed, Apr 22 2015 10:27 AM

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మంచిరెడ్డి - Sakshi

హైదరాబాద్ : అనుకున్నట్లే అయ్యింది. తెలంగాణలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆపార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి షాక్ ఇచ్చారు.  రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సైకిల్ దిగి కారెక్కేందుకు రెడీ అయ్యారు. టీడీపీ నేతల బుజ్జగింపు ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం ఉదయం టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.  మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురువారం అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

కాగా గడిచిన రెండు రోజులుగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ...టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.  ఈ నేపథ్యంలో ఆయన నిన్న ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులోని తన వ్యవసాయక్షేత్రంలో పార్టీ ముఖ్యనేతలు, సహచరులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు దారితీస్తున్న పరిణామాలను వివరించారు. గత రెండు పర్యాయాలు విపక్షంలోనే ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టలేకపోయానని, ఇప్పుడు అధికారపార్టీతో చేతులు కలిపితే మంచి భవిష్యత్తు ఉంటుందని హితబోధ చేశారు. రాజకీ యంగా ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే అధికారపార్టీ అండదండలు ముఖ్యమని, గతకొన్ని నెలలుగా ఈ సమీకరణలన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు వివరించినట్లు సమాచారం.

Advertisement
Advertisement