ఆ వ్యాఖ్యలు క్షమార్హం కాదు: కిరణ్ బేడి | Sakshi
Sakshi News home page

ఆ వ్యాఖ్యలు క్షమార్హం కాదు: కిరణ్ బేడి

Published Tue, Dec 15 2015 7:07 PM

ఆ వ్యాఖ్యలు క్షమార్హం కాదు: కిరణ్ బేడి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై పరుష పదజాలంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడడాన్ని బీజేపీ నాయకురాలు కిరణ్ బేడి తప్పుబట్టారు. ప్రపంచంలో అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లోని మొదటి 10 మందిలో ప్రధాని మోదీ ఒకరని అన్నారు. అలాంటి వ్యక్తిని పిరికివాడు, మానసిక దౌర్బల్యం కలిగిన వారిగా విమర్శించడం సరికాదని ఉద్బోధించారు. ఈ వ్యాఖ్యలు క్షమార్హం కాదన్నారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేయాలని సూచించారు. ప్రజలను దిగ్భ్రాంతి, బాధకు గురిచేసేవిగా కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. జాతికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తన కార్యాలయంలో సీబీఐ సోదాలు చేయడంతో ప్రధాని మోదీపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకునే ఈ సోదాలు జరిపారని ఆరోపించారు. మంగళవారం ఉదయం నుంచి తన కార్యాలయంతో పాటు పలుచోట్ల సీబీఐ దాడులు చేసిందని తెలిపారు. విద్యా శాఖ కార్యాలయంలోనే సోదాలు జరిపామని సీబీఐ ఇచ్చిన వివరణలో వాస్తవంలేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement