అమెరికా అధ్యక్షుడిగా అదే కఠిన నిర్ణయం | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షుడిగా అదే కఠిన నిర్ణయం

Published Mon, Jan 9 2017 9:48 AM

అమెరికా అధ్యక్షుడిగా అదే కఠిన నిర్ణయం - Sakshi

వాషింగ్టన్‌: ‘సెప్టెంబర్‌ 11’ దాడులకు ప్రతీకారంగా అఫ్ఘానిస్థాన్‌పై యుద్ధం ప్రారంభించిన అమెరికా.. తాలిబన్ల పీఛమణిచిన తర్వాతైనా సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇరాక్‌తో యుద్ధం విషయంలోనూ అంతే. దీంతో అమెరికా వేలమంది సైనికులను కోల్పోయింది. ‘ఉగ్రవాదంపై పోరాటం’గా పాలకులు అభివర్ణించిన సైనిక కొనసాగింపును అమెరికన్లు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలైతే ఏకంగా ఆందోళనలకుదిగాయి. ఇటు సైన్యంలోనూ చీలికలు వచ్చాయి. మెజారిటీ సైనికులు, ఉన్నతాధికారులు ‘క్విట్‌ అఫ్ఘాన్‌’అని నినదించారు. అలాంటి పరిస్థితుల్లో.. అమెరికా అధ్యక్షుడిగా తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని బరాక్‌ ఒబామా చెప్పుకున్నారు.

‘అఫ్ఘానిస్థాన్‌కు మరో 30వేల మంది అమెరికా సైనికులను పంపాలని 2009లో నేను తీసుకున్న నిర్ణయమే నా పరిపాలనా కాలంలోని అత్యంత కఠినమైనది’ అని ఒబామా చెప్పారు. ఆదివారం స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. అఫ్గాన్‌ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నివర్గాల నుంచి డిమాండ్‌ వ్యక్తమైనా, ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదని, కఠినమే అయినా, ఉగ్రవాదంపై పోరాటంలో వెనకడుగు వేయకూడదనే సైనికులను పంపానని తెలిపారు. ‘ఆయా దేశాల నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుంటే ఉగ్రవాదులు మళ్లీ బలం పుంజుకుంటారు. వారికి అలాంటి అవకాశం ఇవ్వకూడదనే సైన్యాన్ని కొనసాగిస్తున్నాం’అని ఒబామా వివరించారు

2009లో అమెరికా 30 వేల మంది సైనికులను అఫ్ఘాన్‌కు పంపడంతో అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సైనికలు సంఖ్య ఒక లక్షకు పెరిగింది. 2011లో అల్‌ ఖాయిదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ను అంతం చేసిన తర్వాతే అమెరికా.. అఫ్ఘాన్‌ నుంచి సైన్యాలను ఉపసంహరించుకోవడం మొదలుపెట్టింది. అయితే ఆ పని ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు. 2017 ప్రారంభం నాటికి దాదాపు 9 వేల మంది అమెరికన్‌ సైనికులు అఫ్ఘాన్‌లోనే ఉన్నారు. మరో 300 మంది మెరైన్లను పంపాలని అమెరికా ఇటీవలే నిర్ణయించింది. ఇరాక్‌ యుద్ధం తర్వాత పుట్టుకొచ్చిన ఐసిస్‌తోనూ అమెరికా బలగాలు నేరుగా తలపడుతున్నాయి. ‘ఇరాక్‌ సైన్యానికి సహకారం’ పేరుతో దాదాపు 5వేల మందికి పైగా అమెరికా సైన్యాలు ఇరక్‌లో పనిచేస్తున్నాయి.

Advertisement
Advertisement