రాహుల్‌పై ట్విట్టర్‌లో మళ్లీ సెటైర్లు | Sakshi
Sakshi News home page

రాహుల్‌పై ట్విట్టర్‌లో మళ్లీ సెటైర్లు

Published Thu, Sep 24 2015 1:19 PM

రాహుల్‌పై ట్విట్టర్‌లో మళ్లీ సెటైర్లు - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడానికి ముందే కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా వెళ్లారన్న వార్తలపై ట్విట్టర్‌లో సెటైర్లు జోరందుకున్నాయి. గతంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏకంగా 56 రోజుల పాటు రాజకీయాలకు దూరంగా విశ్రాంతి కోసం రాహుల్ గాంధీ సెలవుపై గుర్తుతెలియని దేశానికి వెళ్లిన విషయం తెల్సిందే.

ఇప్పుడు కూడా ఎక్కువ మంది ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. అయితే బిహార్ ఎన్నికల సమయంలో రాహుల్ దేశంలో లేకపోవడాన్ని ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. ఆయన అమెరికాలో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారని కొందరు ఊహిస్తుంటే మరికొందరు లండన్‌లోని బకింగ్ హామ్ ప్యాలెస్‌కు వెళ్లారని, లేదు అమ్మమ్మను చూసేందుకు మరో దేశం వెళ్లారని మరికొందరు సెటైర్లు విసురుతున్నారు.

‘ఉత్తరప్రదేశ్ రైతులతో కొన్ని గంటలపాటు మాట్లాడడంతో రాహుల్ గాంధీ అలసిపోయారు. విశ్రాంతి కోసం విదేశానికి వెళ్లారని ఒకరు... విశ్రాంత కాంగ్రెస్‌కు సెలవుల ఐకాన్ రాహుల్ అని మరొకరు, రైతులకు భూములు సేకరించడానికి విదేశానికి వెళ్లారు’ అని మరొకరు సెటైర్లు వేస్తున్నారు.

‘ఎక్కడైతే చెవిటి, మూగవాడు టైటిల్‌తో రాహుల్ బయోపిక్ చిత్రం తీశారో అక్కడికి వెళ్లారు.... అలా కాదు. రాహుల్ ప్రపంచ నాయకుడు, బకింగ్ ప్యాలెస్‌లో పేదరికం ఎలా ఉందో పరిశీలించేందుకు వెళ్లారు.... సబ్ కే పాస్ మా ఔర్ ఆపిల్ హై... అమ్మమ్మ ఫిట్‌నెస్ తెలుసుకునేందుకు వెళ్లారు... ఏదైతేనేమీ రాజకీయ సెలవులు పెట్టడంలో రాహుల్ గాంధీ విప్లవం తీసుకొస్తున్నారు... ఇలా ఎవరికిష్టం వచ్చినట్లు వారు ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేస్తున్నారు.

ముందుగా అమెరికాలో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు రాహుల్ వెళ్లారని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కాస్త మాటమార్చి వ్యక్తిగత పనిపై అమెరికా వెళ్లారని చెబుతోంది.

Advertisement
Advertisement