గప్‌చుప్‌ తింటుండగా మాజీ ఎమ్మెల్యేపై దోపిడీ! | Sakshi
Sakshi News home page

గప్‌చుప్‌ తింటుండగా మాజీ ఎమ్మెల్యేపై దోపిడీ!

Published Thu, Jun 1 2017 3:05 PM

గప్‌చుప్‌ తింటుండగా మాజీ ఎమ్మెల్యేపై దోపిడీ! - Sakshi

రోడ్డుపక్కన ఉన్న గప్‌చుప్‌ల బండి వద్ద ఆగి పానీపూరి తింటుండగా.. ఓ బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్డుపక్కన కారు ఆపి.. తన స్నేహితుడితో కలిసి తీరికగా గప్‌చుప్‌లు తింటుండగా బైక్‌ మీద వచ్చిన ఇద్దరు దొంగలు ఆయన కారులో ఉన్న ల్యాప్‌టాప్‌ బ్యాగును దొంగలించారు. ఆ బ్యాగులో ఆయన ల్యాప్‌టాప్‌తోపాటు డిజిటల్‌ కెమెరా, పార్టీ సీనియర్‌ నేతలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. బుధవారం సాయంత్రం  దక్షిణ ఢిల్లీలోని లాడో సరై ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు దొంగలను వెంటాడి పట్టుకొనేందుకు బీజేపీ నేత ప్రయత్నించినప్పటికీ ట్రాఫిక్‌ ఉండటంతో అది సాధ్యపడలేదు. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విజయ్‌ జోలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఎవరన్నది ఇంకా తెలియలేదు.

విజయ్‌ జోలీ బుధవారం సాయత్రం తన ఐ20 కారులో సంగం విహార్‌ నుంచి జానకీపూర్‌ బయలుదేరారు. ఆయన వెంట స్నేహితుడు కూడా ఉన్నారు. ఇద్దరు లాడో సరై ప్రాంతంలో రోడ్డు పక్కన కారును పార్క్‌ చేసి.. పక్కనే ఉన్న గప్‌చుప్‌ల బండి దగ్గరికి వెళ్లారు. అక్కడ తాము గప్‌చుప్‌లు తింటుండగానే బైక్‌ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన కారు కిటికీ అద్దాన్ని పగులకొట్టి కారులోని ల్యాప్‌బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారని, వారిని పట్టుకునేందుకు తాను ప్రయత్నించినా ట్రాఫిక్‌ ఉండటంతో వీలుపడలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement