తెలంగాణ బిల్లు మేమే ప్రవేశపెడతాం: వెంకయ్య | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు మేమే ప్రవేశపెడతాం: వెంకయ్య

Published Fri, Nov 22 2013 4:36 PM

తెలంగాణ బిల్లు మేమే ప్రవేశపెడతాం: వెంకయ్య - Sakshi

తెలంగాణపై చరిత్రలో తొలిసారి ఎన్నడూ లేని విధంగా ప్రతిపాదనలు పెట్టకుండా ప్రతిపక్షాల నుంచి స్పందన కోరుతోందని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ బిల్లు కాంగ్రెస్ పెట్టకపోతే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఆ బిల్లు ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ నేత వెంకయ్య నాయుడు తెలియజేశారు. తెలంగాణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతుందని ఆయన విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వారు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారన్నారు. ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రభుత్వంలోని పెద్దలే సరిగా లేకపోతే ప్రజలకు సమస్యలు సృష్టించడమే అవుతుందన్నారు.

తమ పార్టీ ఇరుప్రాంతాల నాయకులు ఒకే మాటపై ఉన్నారని వెంకయ్య తెలిపారు. తెలంగాణ ఏర్పాటుతోపాటు సీమాంధ్ర ప్రాంత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవోఎం లీకుల ఆధారంగా ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఇది తగదని, ఇరు ప్రాంతాల ప్రజలకు నచ్చజెప్పి, సానుకూల వాతావరణంలో విభజన ప్రక్రియ కొనసాగేలా చూడాలి తప్ప.. విభేదాలతో ఏమీ సాధించలేరని ఆయన తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement