ఒపీనియన్ పోల్స్‌పై ఏంచేశారు? | Sakshi
Sakshi News home page

ఒపీనియన్ పోల్స్‌పై ఏంచేశారు?

Published Sat, Mar 8 2014 4:55 AM

what they did on Opinion foll?

న్యూఢిల్లీ: ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ పోల్స్‌కు అడ్డుకట్ట వేసే విషయంలో ప్రభుత్వ నిర్లిప్తతపై కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తంచేసింది. మరికొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నప్పటికీ ప్రభుత్వం ఈ దిశలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఎన్నికల సంఘం, కేంద్ర న్యాయశాఖలోని శాసన విభాగం కార్యదర్శికి మరో లేఖ రాసింది. ఒపీనియన్ పోల్స్ ఫలితాలపై ఆంక్షల విషయంలో చట్టానికి సవరణలు చేయాలన్న తమ ప్రతిపాదనపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈసీ ఆక్షేపించింది. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు 2004లోనే ఈసీ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచగా, ప్రభుత్వం దానిని లా కమిషన్ పరిశీలనకు పంపింది.
 
   ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం పోలింగ్‌కు 48 గంటలముందు ఒపీనియన్ పోల్స్‌ను నిషేధించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.
   అయితే నోటిఫికేషన్ మొదలుకొని, చివరి దశ పోలింగ్ ముగిసే వరకు వీటిని నిషేధించాలని ఎన్నికల సంఘం కోరుతోంది.
   ఒపీనియన్ పోల్స్ నిర్వహించే సంస్థలు కొన్ని వాటి ఫలితాలను తమకు అనుకూలమైన వారికి అనుగుణంగా ఇస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
   తమకు అధికారం ఉన్నంతవరకు ఈ విషయంలో చర్యలు తీసుకుంటున్నామని, అయితే ఒపీనియన్ పోల్స్ నిషేధం విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ పేర్కొన్నారు.
   కాంగ్రెస్, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీ, ఎస్పీ, అన్నాడీఎంకే, డీఎంకే వంటి పార్టీలు ఒపీనియన్ పోల్స్‌పై ఆంక్షలు ఉండాలని కోరుతుండగా, బీజేపీ ఈ విషయంలో విభేదిస్తోంది.

Advertisement
Advertisement